కశ్మీర్ అంశం కేంద్రం అడుగులు అన్ని వర్గాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. 370 ఆర్టికల్, 35 ఏ ఆర్టికల్ను రద్దు చేయడానికి రాజ్యసభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అమిత్ షా మాట్లాడుతూ.. జమ్ము కశ్మీర్ ను లడక్, జమ్ము కశ్మీర్ లు గా విభజించనున్నట్టు తెలిపారు. వీటిని కేంద్ర పాలిత ప్రాంతాలు చేయనున్నామని, జమ్ము కశ్మీర్కు అసెంబ్లీ ఉంటదని, లడక్ పూర్తి స్థాయిలో కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటదని ప్రతిపాదించారు. అయితే, కశ్మీర్ లో టెన్షన్ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ నష్టాలతోనే స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి.
ఉదయం నుంచి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్ 600 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, టీఎసీఎస్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్ షేర్లు లాభాల్లలో కొనసాగుతుండగా ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు, బ్రిటానియా, బజాజ్ ఫినాన్స్, హీరో మోటార్ కార్స్, డీహెచ్ఎఫ్ఎల్, ఎల్ఐసీ హౌసింగ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
జమ్మూకశ్మీర్కు స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ-కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 7వ తేదీన ప్రకటన చేయనున్నారు. ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా పీడీపీ సభ్యులు రాజ్యసభలో చొక్కాలు చించుకుని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
మరోవైపు కశ్మీర్లో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ ఎయిర్ఫోర్స్ ప్రస్తుతం హై అలర్ట్లో ఉంచారు. కశ్మీర్ను రెండు ముక్కలు చేయడాన్ని బీజేడీ స్వాగతించింది. వాస్తవానికి ఇప్పుడు జమ్మూకశ్మీర్ దేశంలో భాగమైనట్లు బీజేడీ ఎంపీ ప్రసన్న ఆచార్య తెలిపారు. షా ప్రతిపాదించిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. మేం ప్రాంతీయ పార్టీయే అయినా.. కానీ మాకు ముందు దేశమే ముఖ్యమని ఆయన అన్నారు.