సమగ్ర వేదిక ’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పౌరులకు సంబంధించిన వ్యక్తిగత డేటాను అధికారికంగా అనుసంధానం చేయడంపై దర్యాప్తు చేస్తామని కేంద్ర సహాయ హోం శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి బృందం తెలిపింది. న్యూఢిల్లీలో  సోమవారం  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలినప్పుడు తమకు  హామీ ఇచ్చారని బృంద నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వేదిక పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, గోప్యంగా ఉండాల్సిన వివరాల్ని సేకరించి రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. డేటా (గోప్యత – రక్షణ) చట్టం–2017, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌–2008లనే కాకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాల్ని సైతం ఉల్లంఘించిందంటూ  ఫిర్యాదు చేశారు. అధికారిక డేటాను రాజకీయ ఆరోపణలకు, రాజకీయ ప్రయోజనాల కోసం టిఆర్ఎస్‌ పార్టీ దుర్వినియోగం చేస్తోందని వారు ఆరోపించారు. గత నెల 5వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన ఐ.సి.ఎ.ఐ. జాతీయ సదస్సులో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ చేసిన ప్రసంగంలో.. ’సిటిజెన్‌ 360’ పేరట సేకరించిన వివరాలను తెలియజేయడంతో దిగ్భ్రాంతి కలిగించడమే కాకుండా కలతపెట్టిందన్నారు. వివిధ విభాగాల ద్వారా డేటాను అందుబాటులోకి వచ్చిందని, దీని ద్వారా  పౌరులకు సంబంధించిన ప్రై వేట్‌ డేటా సేకరించినట్లు అంగీకరించారని ప్రతినిధి బృందం వివరించింది.‘జయేశ్‌ రంజన్‌  చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా రహస్యంగా వ్యక్తుల వ్యక్తిగత గోప్యతా సమాచార సేకరణ చేసిందని ఒప్పుకున్నారు. ప్రజల అనుమతి లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం చట్ట ఉల్లంఘన అని తెలిపారు.

వ్యక్తుల వ్యక్తిగత, రహస్య డేటా సేకరణ చేయడం చట్ట వ్యతిరేకమని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కేంద్ర సహాయ మంత్రిని కోరారు. ఏ ఏజెన్సీ ద్వారా ఈ డేటాను సేకరించారో వెల్లడించలేదని, ఆ ఏజెన్సీ దగ్గర డేటా గుట్టుగా ఉంటుందనే గ్యారెంటీ ఏముంటుందనే సందేహాన్ని వ్యక్తం చేశారు.‘వివిధ ప్రభుత్వ శాఖలతో లావాదేవీలు నిర్వహించే పౌరుల డేటాలన్నింటినీ పూర్తిగా సేకరించిన తెలంగాణ ప్రభుత్వం అక్షరాలా చట్టాన్ని ఉల్లంఘించింది. ప్రై వేట్‌ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, వ్యక్తిగత ఇ–మెయిల్స్, పాస్‌వర్డ్‌లు, మొదలైవన్నింటినీ పౌరుల ప్రతి డిజిటల్‌ లావాదేవీలను ప్రభుత్వం సేకరించిందని స్పష్టం అవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ డేటాను రాజకీయ లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వం వినియోగిస్తోంది. డేటాను భారీగా దుర్వినియోగం అవుతోంది. అమాయక పౌరుల రోజు వారీ సాధారణ లావాదేవీలన్నింటినీ ప్రభుత్వం సేకరించింది. సమాచారం పేరుతో ప్రజలకు తెలియకుండానే వాళ్ల వేలి ముద్రల డేటాను కూడా ప్రభుత్వం ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా సేకరించిందని ఆయన చెప్పారు. పూర్తిగా ఏకపక్షంగా, చట్టం విరుద్ధమే కాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమని  ఫిర్యాదులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆధార్‌ చట్టానికి సంబంధించి 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పుకు పూర్తి వ్యతిరేకంగా  డేటాను ఎందుకు సేకరించిందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఈ విధంగా చేయడం పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని, రాజ్యాంగం 14, 21 అధికరణాల కింద పౌరుల హక్కులకు కల్పించిన వాటిని ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘించిందని శ్రావణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.


తెలంగాణ ప్రభుత్వం  ప్రజల  ప్రమేయం లేకుండా  ఆధార్‌కు సమాంతరంగా కార్డులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం డేటాను ఏవిధంగా సేకరించిందో, ఏయే చట్టాలను ఉల్లంఘించిందో, దానిని ఏవిధంగా దుర్వినియోగం చేస్తోందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా కూడా ఈ సమాచారం టీఆర్ఎస్‌ పార్టీ ఇతరులకు చేరిందనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరారు. పౌరులకు తెలియకుండానే వాళ్ల సమాచారాన్ని గుట్టుగా సేకరించిన ప్రభుత్వ విధానాన్ని బట్టబయలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒక వ్యక్తి పేరు, చిరునామా వంటి వివరాల్ని ఎకనామిక్‌ సర్వే రిపోర్ట్‌ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సర్వే రిపోర్టును ప్రచురించిన విషయాన్ని గుర్తు చేశారు. ఒక సాధారణ గుర్తింపును ఉపయోగించి 25 ప్రభుత్వ శాఖలతో అనుసంధానం చేయడం దేశంలోనే ఇదే ప్రథమమన్నారు. అనేక మంది పౌరుల ప్రైవేట్‌  డేటా లోకి చొచ్చుకుపోతోంది. ప్రభుత్వం చర్యలు కూడా అందుకు అనుగుణంగా ఉంటున్నాయి. పౌరుల సున్నిత, రహస్య డేటాకు ముప్పు ఏర్పడింది. మొత్తం పౌరుల డేటా రాజకీయ ప్రయోజనాల కోసం రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయి. టిఆర్ఎస్‌ పార్టీ అధికారం కోసం డేటాను దుర్వినియోగం చేయడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉంటుందని విమర్శించారు.

 రాజకీయ ప్రయోజనాల కోసం ’సేవామిత్ర’ అనే పేరుతో రాజకీయ అవసరాల కోసం డేటా సేకరించిందని ఆరోపించారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ‘సిటిజన్‌–360 ‘ దుర్వినియోగం చేయదని గ్యారెంటీ ఏముందని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్‌ కేసులో నిందితులపై కేసులు పెట్టిన తెంగాణ ప్రభుత్వం ఇక్కడ మాత్రం అదే తరహా నేరానికి పాల్పడి పౌరుల డేటాను చోర్యం చేస్తోందన్నారు. దీనిని దుర్వినియోగం చేయదని హామీ ఏదన్నారు. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని పెద్ద మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం సేకరించిందని, దీనిని ప్రభుత్వంతోపాటు అధికార టీఆర్ఎస్‌ పార్టీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఈ విధంగా చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. దీని వల్ల పౌరులకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తెలంగాణ సర్కార్‌ పౌరుల వ్యక్తిగత, గోప్యతా సమాచారాన్ని సేకరించిన చట్ట వ్యతిరేక వ్యవహారాలపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని, నిజాయితీతో కూడిన విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకుల ప్రతినిధి బృందం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి సమర్పించిన వినతిపత్రంలో కోరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: