రద్దయిన భారత రాజ్యాంగం లోని 370వ ఆర్టికల్‌కు సంబంధించి అనేక అబద్ధాలు సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.
 ఆ వివరాలు, వాటికి సంబంధించిన వాస్తవాలు ఇవి.

అబద్ధం -1 : ఆర్టికల్‌ 370 నెహ్రూ-షేక్‌ అబ్దుల్లాల మధ్య జరిగిన చీకటి ఒప్పందం.
వాస్తవం : ఆర్టికల్‌ 370 రాజ్యాంగం రచనా కాలంలోనే దానిలో పొందుపర్చబడి, రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు (1950 జనవరి 26) నుండి, అమలులోకి వచ్చింది.

అబద్ధం 2 : ఆర్టికల్‌ 370 మూలంగా జమ్మూ-కాశ్మీర్‌ ప్రజలు భారత దేశ సార్వభౌమాధి కారాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ చిహ్నాలను అవమానించినా, ఎటువంటి నేరమూ కాదు.
వాస్తవం : ఇది శుద్ధ అబద్ధం. ఆర్టికల్‌ 370 లో అలాంటి అంశమే పేర్కొనలేదు. అలాంటి అంశం ఉందని చెప్పడం స్వాతంత్య్ర సమర యోధులైన రాజ్యాంగ నిర్మాతలందరినీ అవమానించడమే. స్వాతంత్య్ర పోరాట వీరులైన రాజ్యాంగ నిర్మాతలు తమ జాతీయ పతాకాన్ని అవమానిస్తే నేరం కాదని రాజ్యాంగం లోని ఒక ఆర్టికల్‌లో రాశారని ప్రచారం చేయడం అబద్ధాలకు పరాకాష్ట!

అబద్ధం 3 : సుప్రీం కోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పని చేయవు.
వాస్తవం : ఇదో పెద్ద అబద్ధం. ఉదాహరణకు 2016లో 'జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రం ఆర్టికల్‌ 370 కారణంగా సర్వసత్తాక అధికారాలు కలిగిన రాష్ట్రం' అని ఆ రాష్ట్ర హైకోర్టు పేర్కొంటే దానిని 2016 డిసెంబరులో సుప్రీం కోర్టు కొట్టివేసింది. జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రం సర్వసత్తాక దేశమైన ఇండియాలో ఒక భాగమని పేర్కొన్నది. ఆ తీర్పును జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్ర హైకోర్టు గానీ, ప్రభుత్వం గానీ వ్యతిరేకించలేదు. సుప్రీం కోర్టు తీర్పులే కాదు, రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఈ రాష్ట్రంలో వర్తిస్తున్నాయి. ఉదాహరణకు 11-2-56, 19-2-94ల మధ్య జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రపతి 47 ఉత్తర్వులు ఇచ్చారు. అన్ని ఉత్తర్వులను ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది.

అబద్ధం 4 : జమ్మూ-కాశ్మీర్‌లో ఉండే కాశ్మీర్‌ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే, ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవు తుంది. అదే, పాకిస్తాన్‌ యువకుడిని పెళ్లి చేసు కుంటే మాత్రం, పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరీ పౌరసత్వం లభిస్తుంది.
వాస్తవం : ఈ ప్రచారం కూడా అబద్ధమే. ఇలాంటి అంశమేదీ ఆర్టికల్‌ -370లో లేదు. కాకపోతే రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డరు ప్రకారం 35-ఎ ఆర్టికల్‌ అమలులోకి వచ్చింది. దానికి అనుగుణంగా జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం చేసింది. దాని ప్రకారం ఆ రాష్ట్రంలోని పురుషుడు వేరే రాష్ట్ర యువతిని పెళ్లి చేసుకుంటే, వారి సంతానానికి వారసత్వ హక్కులు లభిస్తాయి. అదే కాశ్మీర్‌ యువతి వేరే రాష్ట్రానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంటే, వారి సంతనానికి ఆ రాష్ట్ర పౌర హక్కులు, వారసత్వ హక్కులూ లభించవు. అంతేకాని, పాకిస్తాన్‌ పౌరుడిని పెళ్లి చేసుకుంటే, ఆమె భర్తకు కాశ్మీర్‌ పౌరహక్కులు లభిస్తాయనడం పూర్తిగా తప్పుడు ప్రచారం.

అబద్ధం 5 : కాశ్మీర్‌లో మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బౌద్ధులు) రాజ్యాంగ బద్ధంగా రావలసిన 16 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదు.
వాస్తవం : ఇది కూడా అబద్ధ ప్రచారమే. రాజ్యాంగం భారత దేశం మొత్తంలోను కొందరిని మైనారిటీలుగా నిర్ణయించింది. వారు ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, జొరాస్ట్రియన్లు (పార్సీలు). అంతేకాని, ప్రతి రాష్ట్రానికీ వేరు వేరుగా మైనారిటీలు నిర్ణయించ బడలేదు. పంజాబ్‌లో సిక్కులు సంఖ్యలో మెజారిటీ, హిందువులు మైనారిటీ. నాగాలాండ్‌, మిజోరాం, లక్షద్వీప్‌, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌లో క్రైస్తవులు సంఖ్యలో మెజారిటీ, హిందువులు మైనారిటీగా ఉంటున్నారు. కాని రాజ్యాంగం దేశానికంతటికీ మాత్రమే మైనారిటీలను నిర్ణయించిన కారణంగా ఆ రాష్ట్రాలలో కూడా పైన చెప్పిన ఆరు మతాల వారు మాత్రమే, మైనారిటీ లుగా పరిగణించబడుతున్నారు. ఉదాహరణకు పంజాబ్‌లో సిక్కులు మెజారిటీ సంఖ్యలో ఉన్నా, రాజ్యాంగం ఆ రాష్ట్రంలో కూడా సిక్కులను మైనారిటీగానే గుర్తిస్తోంది. అలాగే జమ్మూ-కాశ్మీర్‌ లోని కాశ్మీర్‌ ప్రాంతంలో ముస్లింలు సంఖ్యలో మెజారిటీగా ఉన్నా, కొన్ని ప్రాంతంలో బౌద్ధులు సంఖ్యలో మెజారిటీగా ఉన్నా రాజ్యాంగం ఆ రాష్ట్రంలో ఆ రెండు మతాల వారినీ మైనారిటీలు గానే గుర్తిస్తోంది. ఇదీ వాస్తవం.
 ఇలా ఆర్టికల్‌-370 ద్వారా హిందువులకు అన్యాయం జరుగుతోందంటూ అబద్ధ ప్రచారాలు చేసి, మతాల మధ్య విభేదాలు పెంచుతున్న వారి పట్ల దేశ భక్తులందరూ అప్రమత్తంగా ఉండాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: