అదేంటో గాని ఈ మధ్య మన బాబుగోరు.. ఆయన పుత్రరత్నం చిన్న బాబుగోరు ఎక్కువుగా సోషల్ మీడియాలోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఊరికినే వీడియోలు కామెంట్లు చూసుకుంటూ గడిపేకంటే.. ఎదో నాలుగు విమర్శలు పడేస్తే.. తెలుగు తమ్ముళ్లు కూడా ఖుషి అవుతారనుకున్నారో ఏమో గాని.. బాబులిద్దరూ ఈ మధ్య ట్విట్టర్ లో తెగ రెచ్చిపోతున్నారు. ఎంతైనా మన బాబుగొరికి రాజకీయ పరంగా దాదాపుగా నలభై ఏళ్ళ అనుభవమయ్యే.. ఇది మాములు రికార్డు కాదని.. బాబుగారే రోజు సెలవిస్తారు. మనం కూడా ఈ ముచ్చట విని విని విసుగొచ్చి నీరసించిపోయామనుకోండి, అదే వేరే విషయం. ప్రస్తుత విషయంలోకి వెళ్తే.. బాబుగోరు జగన్ ప్రభుత్వం పై ట్విట్లతోనే యుద్దాన్ని ప్రకటిస్తున్నారు. వైసీపీ నేతలు చాలా దారుణాలు చేస్తున్నారని.. బాబుగారు బాగా సీరియస్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు మొత్తం బాబుగారు ట్విట్టర్ లోనే గడిపినట్లు ఉన్నారు. ప్రతి రెండు గంటలకు ఓ కామెంట్ పెట్టుకుంటూ వచ్చారు. కానీ లైక్ లు షేర్ లు లాంటివి పెద్దగా రాలేదనుకోండి.. అది ఉన్న విషయమే.
ఇంతకీ బాబుగారి బాధలోకి వెళ్తే.. అసలు అన్నక్యాంటీన్ల మూసివేత వల్ల పేదలు ఆకలి తీర్చుకోడానికి అవస్థలు పడుతున్నారని.. అలాగే 20 వేలమంది క్యాంటీన్ ఉద్యోగులు జీవనోపాధి కోల్పోయారని.. బాబుగారు తెగ ఇది అయిపోతున్నారు. అలాగే ప్రభుత్వ అనాలోచిత చర్యలవల్ల చిరుద్యోగులు, ఒప్పంద ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తన దివ్యదృష్టితో వారి బాధలను తిలకించినట్లు ట్వీట్ చేశారు. పైగా వ్యవస్థలో మార్పు తేవాలంటే, తనలాగా ముందు ఒక ప్రణాళిక తయారుచేసుకుని, తనలాంటి వారి చేత సాధ్యాసాధ్యాలు అంచనా వేయించి.. అప్పుడు గాని పాత వ్యవస్థను రద్దు చేయడమో, మార్పు చేయడమో చేయాలని బాబుగారు సెలవిచ్చారు. ఇస్తారు బాబుగారికి ఇలాంటి మాటలు చెప్పడంలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయ్యే.
అన్నట్లు బాబుగారు ఇసుక విధానం గురించి ఓ మాట అన్నారండోయ్. జగన్ వచ్చీ రావడంతోనే పాత ఇసుక విధానాన్ని రద్దుచేసేసారు. కొత్త విధానం ఎప్పుడో తీరిగ్గా వస్తుందంట. ఏమిటీ పిల్లల ఆటలు ? అని క్వశ్చన్ మార్క్ పెట్టి మరీ.. బాబుగారు బలంగా ప్రశ్నించారు. కాకపోతే ఇసుక మాఫియాకి కర్త కర్మ క్రియ తానే అనే విషయాన్ని మాత్రం బాబుగారు చాల గోప్యంగా ఉంచారు. ఎందుకంటే ఇలాంటి రహస్యాలు మనలాంటి వాళ్లకు పెద్దగా తెలియవని బాబుగారి కంప్యూటర్ బ్రెయిన్ కి ప్రగాఢ విశ్వాసమయ్యే. మొత్తానికి బాబు, సంపూర్ణేష్ బాబులా ఏదేదో మాట్లాడేస్తూ.. నెటిజన్లకు బాగానే కామెడీని పంచుతున్నాడు.