బీజేపీ సీనియర్ నేత, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్(67) కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడం, గుండెపోటు రావడంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్ ఎయిమ్స్కు చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఆమెకు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అనారోగ్యం కారణంగానే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ పోటీ చేయని విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా, బీజేపీ సీనియర్ నేత అయిన సుష్మాస్వరాజ్ కేంద్ర విదేశాంగ శాఖలో తన ముద్ర వేసుకున్నారు.కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తీరే వేరు. సీనియర్ బీజేపీ నాయకురాలిగా పార్టీ తరఫున గళం వినిపించే సుష్మా విదేశాంగ బాధ్యతలు చేపట్టిన తర్వాత...ఆ శాఖను కొత్త పుంతలు తొక్కించారు. తమ సమస్యను ప్రత్యక్షంగా వచ్చి చెప్పుకున్నా...సామాజిక మాద్యమమైన ట్విట్టర్లో దాన్ని నివేదించుకున్నా..ఆమె తక్షణం పరిష్కారం చూపించారు.ఎందరికో న్యాయం చేస్తుంటారు. సోషల్ మీడియా వేదిక ద్వారా సుష్మా స్వరాజ్ విశేష అభిమానులను కలిగి ఉన్నారు.
ఇటీవల ఆమె చివరిసారిగా కశ్మీర్ విభజనపై స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తన జీవితకాలంలో ఇటువంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఆమె మరణం పట్ల బీజేపీ శ్రేణులో శోకసంద్రంలో ముగిగిపోయాయి.
సుదీర్ఘ రాజకీయవేత్తగా, స్వదేశీ విధానాలకు పెద్దపీట వేసే పార్టీ నాయకురాలిగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో చురుకుగా స్పందిస్తూ సమస్యల విషయంలో గొప్ప మానతవత్వంతో వ్యవహరించే వ్యక్తిగా సుష్మాకు పేరుంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవమున్న సుష్మా స్వరాజ్య ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని మీడియా సమావేశంలో ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలా.. వద్దా.. అనేది పార్టీ నిర్ణయిస్తుందని కానీ, ఆరోగ్య పరమైన కారణాల వలన పోటీ చేయకూడదని ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపారు. మధ్యప్రదేశ్ ఇండోర్ లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆమె తన ఆరోగ్య కారణాల వల్ల ఎన్నికల బరి నుంచి వైదొలగుతున్నట్టు స్పష్టం చేశారు.