ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమ్మినబంటు మరోమారు అందరినీ ఆశ్చర్యపరిచారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ రాష్ట్రాన్ని రెండు యూటీలుగా కూడా చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సమయంలో....జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ఇవాళ కశ్మీర్లో పర్యటించారు. పర్యటించడమే కాకుండా...స్థానికులతో కలిసి భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
జాతీయ భద్రతా సలహాదారు అయిన అజిత్ ధోవల్ కశ్మీర్కు వెళ్లిన దోవల్ సోఫియాన్ జిల్లాలో పర్యటించారు. సోఫియాన్లో రక్షణ దళాలతోనూ దోవల్ మాట్లాడారు. స్థానిక పోలీసులతోనూ ముచ్చటించారు. కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ కూడా హాజరయ్యారు. దీంతోపాటుగా స్థానికులతో మాట్లాడారు. వారితో కలిసి మధ్యాహ్నం భోజనం కూడా చేశారు. ఇదిలాఉండగా, జమ్మూకశ్మీర్లో ప్రస్తుతం పరిస్థితి శాంతియుతంగానే ఉంది. శ్రీనగర్లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. కశ్మీర్కు చెందిన ప్రముఖ రాజకీయవేత్తలను హౌజ్ అరెస్టు చేసిన నేపథ్యంలో కశ్మీర్లో పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించేందుకు ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్ అక్కడకు వెళ్లారు.
ఇదిలాఉండగా, దేశ భద్రత కోసం ధోవల్ చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించింది. అజిత్ ధోవల్ను మరో అయిదేళ్ల పాటు పొడగిస్తున్నట్లు గత జూన్ నెలలో ప్రభుత్వం వెల్లడించింది. 2014లో జాతీయ భద్రతా సలహాదారుగా ధోవల్ బాధ్యతలు స్వీకరించారు. 2016లో సర్జికల్ స్ట్రయిక్స్తో పాటు ఈ ఏడాది బాలాకోట్ దాడులు కూడా ధోవల్ నేతృత్వంలో జరిగాయి. 1968 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ధోవల్ ఎక్కువ శాతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేశారు. పాక్లో ఆరేళ్లు ఉన్నారు. 1988లో కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు. దేశ భద్రత విషయంలో దోవల్ అభిప్రాయాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తుంటారు.