తమిళనాడు లోని తిరుచ్చి లో  ఓ వ్యక్తిపై హత్యాయత్నం. పట్ట పగలే ఐదుగురు కలిసి ఒక వ్యక్తిని విచక్షణా రహితంగా నరికారు. వెంటాడి, వేటాడి రాడ్లతో కొడుతూ, కత్తులతో నరికారు. అందరూ చూస్తుండగానే పక్కా స్కెచ్ వేసి మరీ దారుణంగా అంతమొందించేందుకు ప్రయత్నించారు. మృతి చెందాడనుకుని వదిలేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తుంది. 



తిరుచ్చి, తిరువనైకోవిల్, తిమ్మరాజు సముద్రం ప్రాంతానికి చెందిన మణికంఠన్, అదే ప్రాంతానికి చెందిన శివ అనే యువకుడి సోదరిని ప్రేమిస్తున్నాడు. ఇదే విషయమై శివ పలుమార్లు మణికంఠను మందలించిన తీరు మార్చుకోకపోవడంతో కొంత కాలంగా విభేదాలున్నట్టు తెలుస్తుంది.



ఎంతకూ మణికంఠ తీరు మార్చుకోకపోవడంతో శివ పగతో రగిలిపోయాడు. ఎలాగైనా మణికంఠను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులు నలుగురితో కలిసి పక్కా స్కెచ్ వేశాడు. తిరుచ్చిలో భారతీ వీధిలో ఒంటరిగా వెడుతుండగా బైకుల పై వచ్చిన ఐదుగురు నిందితులు తీవ్రంగా కత్తులు, రాడ్లతో దాడి చేసి పారిపోయారు.



ప్రాణాపాయ స్థితిలో ఉన్న మణికంఠను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మణికంఠ పై చేసిన దాడి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ ఐదుగురి కోసం గాలిస్తున్నారు. ఈ దాడి ఘటన సీసీ టీవీ దృశ్యాలు బయటకు రావడంతో తమిళనాట భయానకం కల్గిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: