ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజన వంటి అంశాలపై కేంద్రప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరించింది. సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో రద్దు చేయగలిగింది. జమ్మూ కాశ్మీర్ ను విభజించగలిగింది. జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా వేశారు. అయితే, పరిస్థితులు అదుపులోకి రావాలంటే కొంత సమయం పడుతుంది. అందులో సందేహం అవసరం లేదు.
ఇప్పుడు కేంద్రం ముందున్న అసలు సమస్య కాశ్మీర్ గురించి. కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాద సమస్యలు అధికంగా ఉన్నాయి. ఈ ఉగ్రవాదాన్ని రూపుమాపాలి అంటే చాలా కష్టం. అంత త్వరగా సమస్య కొలిక్కి రాదు. సమయం పడుతుంది. దీనికోసం ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, అక్కడి ప్రజలను మోటివేట్ చేస్తూ, యువతకు ఉద్యోగాలను కల్పించాలి. అప్పుడే అక్కడ శాంతి లభిస్తుంది.
ఇదిలా ఉంటె, చట్టసభల్లో ఆమోదం పొందిన జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లుకు నిన్న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. అయితే, జమ్మూ కాశ్మీర్, లడక్ లు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి అనే విషయాన్ని కూడా ఈ గెజిట్ లో స్పష్టంగా చెప్పారు. అక్టోబర్ 31 నుంచి కేంద్రపాలిత ప్రాంతాలుగా అధికారికంగా అమలులోకి వస్తాయి. ఆరోజు నుంచే ఎందుకు అనే దానిపై కూడా ఓ స్పష్టత వచ్చింది.
ఆరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. దేశంలో 534 సంస్థానాలకు ఇండియాలో విలీనం చేసిన గొప్ప నేత సర్దార్ వల్లభాయ్ పటేల్. హైద్రాబాద్, జునాగఢ్ వంటి వాటి విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతీసుకుని వాటిని నయానో భయానో ఒప్పించి ఇండియాలో భాగం చేశారు.
కాశ్మీర్ విషయంలో నెహ్రు చొరవ తీసుకున్నారు. అక్కడ నెహ్రు పేరును మార్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరును తెరపైకి తీసుకురావాలంటే... తేదీ చారిత్రాత్మకంగా ఉండాలి. అందుకోసమే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజునుంచి ఆ రెండు రాష్ట్రాలు అధికారికంగా కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తించబడతాయి.