తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఎంత ప్రీతిపాత్రమైన విషయమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే ప్రత్యేకంగా హెలీకాప్టర్ వేసుకొని పర్యటించారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు గోదావరి నది సజీవంగా ఉందని, గోదావరి అద్భుత జీవనదిని సాక్షాత్కరింపజేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. సజీవ గోదావరిని అందించిన నీటిపారుదల శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలియజేశారు. ధర్మపురిలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్ లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
దీనికి కొనసాగింపుగా తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బారాజ్లు, పంప్హౌస్లకు దేవతామూర్తుల పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. మేడిగడ్డ బారాజ్ కి లక్ష్మి బారాజ్ గా, కన్నెపల్లి పంపుహౌజుకు లక్ష్మి పంపు హౌజుగా నామకరణం చేశారు.అన్నారం బ్యారేజికి సరస్వతి బారాజ్ గా, సిరిపురం పంప్ హౌజ్ కు సరస్వతి పంపుహౌజుగా నామకరణం చేశారు. సుందిళ్ల బారాజ్ కు పార్వతి బారాజ్ గా, గోలివాడ పంపుహౌజు కు పార్వతి పంపుహౌజుగా నామకరణం చేశారు. నంది మేడారం రిజర్వాయర్ కమ్ పంపు హౌజుకు నంది పేరు ఖరారు చేశారు. లక్ష్మిపురం పంపుహౌజుకు గాయత్రి పేరు పెట్టారు.
కాళేశ్వరంను సందర్శించి కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజీ ఎగువన 150 కిలోమీటర్ల మేర నీరు నిలువ ఉండటాన్ని ఎరియల్ వ్యూ ద్వారా సీఎం చూశారు. అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలపై కాలినడకన తిరిగి పరిశీలించారు. ప్రాణహిత నుంచి కొన్ని లక్షల క్యూసెక్కుల్లో భారీ వస్తున్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. గేట్ల నిర్వహణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 45 లక్షల ఎకరాలకు సాగునీటిని, పారిశ్రామిక అవసరాలు సహా 80శాతం తెలంగాణకు తాగునీటిని అందించే కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలో పూర్తయినందుకు సంతోషంగా ఉందన్నారు.