ఈ మద్య కాలంలో ఎక్కడ చూసినా ఆడవారికి రక్షణ లేకుండా పోతుందని ప్రతిరోజూ వార్తల్లో చదువుతూనే ఉన్నాం.  ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా..పోలీస్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నా కామాంధులు ఎక్కడో ఓ చోట రెచ్చిపోతూనే ఉన్నారు.  ఆడవారి వయసుతో పనిలేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.  ఇటీవల హన్మకొండలో తొమ్మిదేళ్ల చిన్నారిని తల్లి పక్కన పడుకుంటే ఎత్తుకు వెళ్లి అత్యాచారం చేసి తర్వాత గొంతునులిమి చంపేశాడు.  ప్రవీణ్ అనే ఆ దుర్మార్గుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది.

బొమ్మలరామారం వద్ద హజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు మైనర్లను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి బావిలో పూడ్చి పెట్టిన ఘటనలో అతనికి కూడా ఉరిశిక్ష విధించాలని ప్రజలు, మహిళా సంఘాలు ముక్త కంఠంతో కోరకుంటున్నారు.  ఇవి మర్చిపోక ముందే మరో యువతిని దారుణంగా  అత్యాచారం చేయగా అవమాన భారంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. నానమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్న 15 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

వరంగల్‌లోని సమ్మయ్య నగర్‌కు చెందిన బాలిక తల్లిదండ్రులను కోల్పోయి ప్రస్తుతం నానమ్మ వద్ద ఉంటోంది.  ఆ బాలిక తొమ్మిదవ తరగతి చదువుతుంది..అయితే  హసన్‌పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన తిరుపతి, ప్రసన్నకుమార్‌ అనే యువకులతో బాలికకు పరిచయం ఉండటంతో మాయ మాటలు చెప్పి బాలికను బైక్ పై ఎక్కించుకొని పెంబర్తి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డారు. వీరితోపాటు మరో బాలుడు కూడా ఆమెపై అఘాయిత్యం చేశాడు.

అనంతరం ముగ్గురూ పరారయ్యారు. తనపై అత్యాచారం జరిగిందని నానమ్మతో చెప్పుకొని బాధపడిన ఆ యువతి తనపై అత్యాచార ఘటనను పదేపదే తలచుకుని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని..వారిని కూడా పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: