జమ్ముకశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే 370, 35ఏ అధికరణాల తొలిగింపు నేపథ్యంలో ఈ నెల 5 నుంచి కశ్మీర్లోయలో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతె జన జీవనం స్తంభించింది. అయితే, బక్రీద్ పండుగ నేపథ్యంలో కశ్మీర్ లోయలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇందుకు అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. మసీదుల్లో ప్రశాంతంగా ప్రార్థనలు చేసేందుకు అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఆదివారం సెలవు దినమైనా బ్యాంకులు, ఏటీఎంలు, కొన్ని మార్కెట్లను తెరిచి ఉంచారు. ముందస్తుగానే ప్రభుత్వోద్యోగులు, కార్మికుల వేతనాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఎప్పుడైనా డబ్బు విత్డ్రాయల్ చేసుకునేందుకు వీలుగా ఏటీఎంల్లో నగదు అందుబాటులో ఉంచుతున్నారు. బక్రీద్ సందర్భంగా కశ్మీరీ లోయలో 2.5 లక్షల గొర్రెలను అందుబాటులోకి తెచ్చారు. గవర్నర్ సత్యపాల్ మాలిక్ కశ్మీరీలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
పంండుగ నేపథ్యం, పరిస్థితులు సద్దుమణగడంతో...ఐదు జిల్లాల్లో పూర్తిగా కర్ఫ్యూ ఎత్తివేశారు. అయితే 144 సెక్షన్ విధించారు. మరో ఐదు జిల్లాల్లో ఆంక్షలు సడలించారు. కిష్టావర్ జిల్లాలో రాత్రి తొమ్మిది గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. ఇంటింటికి నిత్యా వసరాల సరఫరాకు మొబైల్ వ్యాన్లను రంగంలోకి దించారు. శ్రీనగర్ నగర పరిధిలో 6 మండీలు ఏర్పాటుచేశారు. కశ్మీర్ డివిజన్ పరిధిలో 3,697 రేషన్ షాపులకు 3557 చౌక దుకాణాలను తెరిచి ఉంచారు. ఈ నేపథ్యంలో సదరు షాప్ల వద్ద ప్రజలు బారులు తీరారు. దాదాపు రెండు నెలలకు సరిపడా నిత్యావసర నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇక సౌదీ అరేబియాలో ‘హజ్'యాత్రకు వెళ్లిన యాత్రి కులు ఈ నెల 18 నుంచి తిరిగి రానున్నారు. వారు తమ సొంత స్థలాలకు వెళ్లేందుకు ‘హెల్ప్లైన్' డెస్క్లు ఏర్పాటు చేశారు.
ఇదిలాఉండగా, శ్రీనగర్లో శనివారం అక్కడక్కడ ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో భారీగా ప్రజలు గుమికూడటంపై అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. ప్రజలంతా నివాసాలకు వెళ్లిపోవాలని, దుకాణదారులు షాపులు మూసివేయాలని లౌడ్ స్పీకర్లలో ప్రకటించారురు. కశ్మీరీ లోయలో సుమారు 10 వేల మంది నిరసన తెలిపారన్న మీడియా వార్తలను కేంద్ర హోం శాఖ తోసిపుచ్చింది. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సర్వీసులపై నిషేధం ఉన్న నేపథ్యంలో సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో కశ్మీరీలు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న తమ వారితో సంప్రదింపులకు 300 స్పెషల్ టెలిఫోన్ బూత్లు ఏర్పాటుచేశారు. విద్యుత్, నీటి సరఫరాలో ఆటంకాలు లేకుండా చర్యలు చేప ట్టారు. నిరాశానిస్పృహల్లో ఉన్న వారి కోసం ‘మదద్ఘర్' పేరిట 9469793260 హెల్ప్లైన్ ఏర్పాటుచేసినట్లు సీఆర్పీఎఫ్ తెలిపింది.