కేసీఆర్ రాజకీయాల్లో కొన్ని మెరుపు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థుల అంచనాలకు కూడా అందని ఎత్తులు వేసి చిత్తు చేస్తుంటారు. ఇది రాజకీయాల వరకే.. కానీ కేసీఆర్ ఇచ్చిన షాక్ తో ఓ దర్శక దిగ్గజానికి నిద్ర కూడా పట్టలేదట. తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి నేరుగా ఫోన్ కాల్ రావడమే ఆ షాక్ కు కారణం.


సినిమాల నుంచి రిటైర్ అయి విశ్రాంతి తీసుకుంటున్న కె.విశ్వానాథ్ కు శనివారం రాత్రి తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేయడమే ఇందుకు కారణం. రాత్రి ఫోన్లో మాట్లాడి రేపు మీ ఇంటికి వస్తున్నానని చెప్పేశారట కేసీఆర్. మొదట ఈ కాల్ చేసింది కేసీఆర్ అనే విషయాన్ని విశ్వనాథ్ నమ్మలేకపోయారట. ఎవరో గొంతు మార్చి మాట్లాడుతున్నారేమో.. తనను ఆటపట్టిస్తున్నారేమో అనుకున్నారట. ఆ తర్వాత అది స్వయంగా కేసీఆరే అని తెలుసుకున్నాక.. విశ్వనాథ్ కు ఆ రాత్రి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదట. ఈ విషయాను కేసీఆర్ ఇంటికి వచ్చినప్పుడు విశ్వనాథ్ ఆయనతో షేర్ చేసుకున్నారు.


కేసీఆర్ స్వయంగా ఇంటికి రావడంతో విశ్వనాథ్‌ సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పగా కట్టారు. రైతుల కష్టాలు తీరుతాయి. కాళేశ్వరం నీళ్లు వస్తున్నప్పుడు మీ కళ్లల్లో ఎంతో ఆనందం చూశాను. నిజంగా చాలా గొప్ప ప్రాజెక్టు. రైతులకు సాగునీరు ఇవ్వాలనే మీ తపనంతా విజయవంతం అవుతుంది’’ అని విశ్వనాథ్ భార్య జయలక్ష్మి ముఖ్యమంత్రితో చెప్పారు.


మీరు చాలా కష్టపడి ప్రాజెక్టులు కడుతున్నారు, అయినా విమర్శలు తప్పడం లేదు, ఎలా భరిస్తున్నారు అని సిఎంను విశ్వనాథ్ అడిగారు. ‘‘రాజకీయాల్లో అన్నీ అలవాటైపోయాయి. తప్పదు కూడా. ప్రజల కోసం పనిచేస్తున్నామనే ఉద్దేశ్యంతో అవన్నీ పెద్దగా పట్టించుకోవడం లేదు. పని చేసుకుంటూ పోతున్నాను’’ అని కేసీఆర్ సమాధానమిచ్చారు. ప్రజల కోసం చేసే పనికి దైవ కృప ఉంటుంది. మీకు కూడా ఉంది అని విశ్వనాథ్ కేసీఆర్ ను దీవించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: