ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం సముద్రతీరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నడి సంద్రంలో కోస్టల్ జాగ్వార్ నౌకలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిడడంతో దట్టమైన పొగలు అలుముున్నాయి. దాంతో ప్రమాదం ముంచుకు వస్తుందన్న భయంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలోకి దూకేశారు.
‘ కోస్టల్ జాగ్వార్’లో ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా ఆ నౌకలో ఉన్న 29 మంది నీటిలోకి దూకేశారు. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది బోట్లతో చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్పెషల్ బోట్ల సాయంతో మంటలను అదుపుచేశారు. కాగా, 28 మందిని నౌకాదళం సిబ్బంది, కోస్ట్ గార్డులు కాపాడగా, మిగిలిన ఒకరి జాడ ఇంకా తెలియరాలేదు. క్షతగాత్రులను దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన అతని కోసం నౌకాదళం సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు.
కాగా, ఈ ప్రమాదం చోటుచేసుకోవడానికి గల కారణాలపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు సముద్రంలోని కోస్టల్ జాగ్వార్ నౌక మండుతూనే ఉండటంతో దాన్ని ఆర్పేందుకు నేవీ సిబ్బంది, కోస్ట్ గార్డులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. అయితే ఇలాంటి ప్రమాదం ఏవైనా టెక్నికల్ విషయాల వల్ల జరిగిందా లేదా ఏ ఇతర కారణం అయి ఉంటుందా అన్న విషయం తెలియాల్సి ఉంది.