వరసగా వచ్చిన సెలవులు ఓవైపు.. శ్రీవారి పవిత్రోత్సవాలు మరోవైపు.. అందుకే.. భక్తులతో నిత్య కల్యాణం పచ్చతోరణంలా ఉండే శ్రీవారి సన్నిధి తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. తాజాగా వరుస సెలవులు రావడంతో తిరుమల శ్రీవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. తిరుమల కొండలు భక్తులతో నిండిపోయాయి.


శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు గంటల్లో పూర్తవుతోంది. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఈవోను కోరారు. ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి ట్విట్‌ చేశారు.


వరుస సెలవులు రావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని స్వామి వారి చెంతకు అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సరిపడ ఆహారం, తాగునీరు వంటి ఏర్పాట్లు చేయాలని ఈవోను వైవీ సుబ్బారెడ్డి కోరారు. మరోవైపు ప్రస్తుతం తిరుమలలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.


ఆదివారం మొదలైన ఈ ఉత్సవాలు 13వ తేదీ వరకూ ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట, రెండోరోజు పవిత్ర సమర్పణ, చివరి రోజు పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. పవిత్రోత్సవాల వేళ స్వామివారిని చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు పడకుండా ఉంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: