వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వరసగా అనేక పధకాలు ప్రారంభించారు. పధకాలు ప్రారంభించిన తరువాత వాటి అమలు విషయంలో కూడా జగన్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. ప్రమాణస్వీకారం రోజున నాలుగు లక్షల ఉద్యోగాలను ప్రకటించిన జగన్, దానికి సంబంధించిన కార్యాచరణను కూడా ప్రారంభించారు. ఆగష్టు 15 వ తేదీన గ్రామా వాలంటీర్లు ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు. గ్రామాల్లో పార్టీ 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీరు ఉంటారు.
ఈ వాలంటీర్ తన పరిధిలో ఉన్న 50 కుటుంబాలకు సంబంధించిన డాటాను తీసుకోవాలి. కుటుంబ వివరాలు ఆర్ధిక పరిస్థితి, ప్రభుత్వ పధకాలు ఏ మేరకు అందించవచ్చు అనే విషయాలను సర్వే చేయాల్సి వస్తుంది. ఈనెల 26 నుచి ఐదు రోజుల పాటు ఈ సర్వేను నిర్వహించాలి. అలా తీసుకున్న డేటాను ప్రభుత్వానికి పంపించాలి. దీనిని ఆధారంగా చేసుకొని ప్రభుత్వం ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పధకాలు అమలు చేసేలా చేస్తుంది.
దీంతో పాటు పింఛన్, ఇంటింటికి సరుకులు వంటి వాటిని గ్రామ వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికి చేరుతాయి. ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి ఇంటింటికి రేషన్ పధకాన్ని అమలు చేయబోతున్నారు. మొదట ఈ పధకాన్ని శ్రీకాకుళంలో ప్రారంభిస్తారు. తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తీసుకొస్తారు.
ఇదిలా ఉంటె ఈనెల 15 వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలో ఎంపికైన గ్రామ వాలంటీర్లంతా వారి వారి మండల ఆఫీస్ లలో రిపోర్ట్ చేయాలి. ఆగష్టు 15 వ తేదీన విధుల్లో చేరిన గ్రామ వాలంటీర్లు అక్టోబర్ 2 వ తేదీ వరకు ఏ ఏ పనులు చేయాలి. ఎలాంటి విధులు నిర్వర్తించాలి అనే దానిపై పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి జిల్లా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.