ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్విభన తరువాత దేశంలో అనేక మార్పులు వచ్చాయి. 130 కోట్ల మంది ప్రజలు జమ్మూ కాశ్మీర్ పూర్తిగా ఇండియాలో భాగస్వామ్యం కావాలని కోరుకున్నారు. అంతేకాదుదేశానికీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ ఒక సమస్యగానే మిగిలిపోయింది. దశాబ్దాల కాలంగా ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఆర్టికల్ 370 ని రద్దుచేసే సాహసాన్ని జాతీయ పార్టీలు చేయలేకపోయాయి. రెండోసారి మోడీ అధికారంలోకి రావడంతో ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం తీసుకునే ముందు జమ్మూ కాశ్మీర్లో ముందస్తు జాగ్రత్తగా బలగాలను మోహరించారు. రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తరువాత, పాకిస్తాన్ మరింత రెచ్చిపోయింది. ఇండియాతో వాణజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. అక్కడితో ఆగకుండా, అంతర్జాతీయంగా ఇండియాపై కంప్లైంట్ చేసేందుకు సిద్ధం అయ్యింది.
భద్రతా మండలిలో కంప్లైంట్ చేసింది. కానీ, దీనిని మండలి సీరియస్ గా తీసుకోలేదు. పైగా జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ కు రష్యా మద్దతు ఇవ్వడంతో పాక్ వెనకడుగు వేసింది. మండలిలో మద్దతు ఇవ్వాలని చైనాను కోరింది. చైనా నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో పాక్ ఇబ్బందుల్లో పడింది. కశ్మీర్ అంశాన్ని ఉపయోగించుకొని భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం, అభ్యంతరాలు వ్యక్తం చేయడం చాలా సులభం. ఈ విషయంలో ముందుకు సాగడం చాలా కష్టం. ఐక్యరాజ్య సమితి మనల్ని పూలమాలతో స్వాగతం పలకడానికి సిద్ధంగా లేరు. శాశ్వత సభ్య దేశాల్లో ఎవరైనా మనకు అడ్డంపడవచ్చు. ప్రజలు వివేకంతో ఆలోచించాలి అని పాక్ విదేశాంగ శాఖా మంత్రి ఖురేషి పేర్కొన్నారు.
భారత్ కు ఇది నైతిక విజయమని చెప్పాలి. ఇక భారత్ లో సుప్రీం కోర్టు కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని.. బలగాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మరికొంత సమయం ఇస్తున్నట్టు సుప్రీం కోర్ట్ పేర్కొన్నది. మరోవైపు దేశంలో వివిధ పార్టీలు మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ బాసటగా నిలిచారు. జమ్మూ కాశ్మీర్లో ఇప్పటి వరకు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. మెల్లగా అక్కడ పరిస్థితులు దారిలోకి వస్తున్నాయి.