ఏపీకి సీఎంగా, వైసీపీ పార్టీకి సమర్ధమైన నాయకుడిగా ఉన్న జగన్, కుటుంబం పట్ల కూడా బాధ్యత కలిగి ఉంటూ మంచి తండ్రి , భర్తగా కూడా నిరూపించుకుంటున్నారు. తండ్రిగా తన కుమార్తెలని ఉన్నత స్థాయిలకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న జగన్ కి ఓ శుభవార్త. ఇప్పటికే ఆయన పెద్ద కుమార్తె హర్షా రెడ్డి ప్రస్తుతం లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో విద్యను అభ్యసిస్తున్నారు. ఆమె మెరిట్లో అక్కడ టాప్ ర్యాంక్ దక్కించుకున్నారు.
ఇప్పుడు ఆయన చిన్న కుమార్తె కూడా విదేశాల్లో విద్యని అభ్యసించడానికి సిద్ధమైంది. వర్షా రెడ్డికి అమెరికా ఇండియానా స్టేట్ లోని ప్రతిష్ఠాత్మక నోట్రెడామ్ యూనివర్శిటీలో సీటు లభించింది. ఈ నెల 20వ తేదీన ఆమె ఆ యూనివర్శిటీలో అడ్మిషన్ తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో కూతురుని యూనివర్సీటీలో జాయిన్ చేయడానికి జగన్ కుటుంబంతో కలిసి యూఎస్ కి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే జగన్కు పలువురు పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలుపుతున్నారు. సీఎంగా ఉన్నా ఇద్దరు కుమార్తెలు బాగా చదివి మెరిట్ కోటాలో సీటు దక్కించుకోవడం నిజంగా ఏ తండ్రికి అయినా గర్వకారణమే.
ఈ నెల 15న సాయంత్రం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, చిన్న కుమార్తె వర్షా రెడ్డిలతో కలిసి యూఎస్ పర్యటనకి వెళ్లనున్నారు. ఈ నెల 24 వరకు ఆయన అక్కడే ఉంటారు. కూతురు అడ్మిషన్ తో పాటు జగన్ ఏపీకి పెట్టుబడులుకి సంబంధించి అమెరికాలో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు.
అలాగే ఈ నెల 17వ తేదీన డల్లాస్ లోని హచిసన్ స్టేడియంలో ప్రవాసాంధ్రులతో వైఎస్ జగన్ ముఖాముఖి చర్చలకు హాజరవుతారు. దీనికోసం నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక వైఎస్ జగన్ రాకను దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున స్వాగత బ్యానర్లు, హోర్డింగులను కూడా కట్టారు.