తెలంగాణలో మరో కఠిన చట్టం అమలులోకి వచ్చింది. రాష్ట్రంలో తాటి, ఈత చెట్లను అక్రమంగా నరికేవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. సెక్షన్ 27, ఆబ్కారీ చట్టం1968 ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. లేఅవుట్ల పేరుతో రియల్ఎస్టేట్ సంస్థలు తాటి, ఈత చెట్లను నరికివేస్తున్నాయని, ఆబ్కారీ చట్టం ప్రకారం వీటిపై చర్యలు తీసుకోవాలని గీత కార్మికులు కోరగా ఈ విధంగా స్పందించారు.
రియల్ ఎస్టేట్ సంస్థలు లేఅవుట్ల పేరుతో తాటి, ఈత చెట్లను ఇష్టారాజ్యంగా నరికి వేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ సచివాలయంలో ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీ నివాస్గౌడ్కు వినతిపత్రం అందజేశారు. చెట్ల నరికివేతతో గీత వృత్తిదారులకు జీవనోపాధి దూరమవుతున్నదన్నారు. తాటి, ఈతవనాల నరికివేతకు అనుమతులివ్వకుండా కలెక్టర్లకు ఆ దేశాలు జారీచేయాలని ఆబ్కారీశాఖ ఉన్నతాధికారులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు.
ఈ వినతి పత్రంపై స్పందించిన మంత్రి ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా చెట్లను నరికివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆ చెట్లను నరికివేయడానికి అనుమతులు ఇవ్వొద్దని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఆయా చెట్లను వేరే ప్రదేశానికి తరలించడానికి అనుమతులు ఇవ్వాలని చెప్పారు. దీనిపై రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు తక్షణం ఆదేశాలు జారీచేయాలన్నారు.
ఇదిలాఉండగా, ఓ ఇంటి యజమానికి అటవీశాఖ అధికారులు షాక్ ఇచ్చారు. అపార్ట్ మెంట్ నిర్మిస్తున్న యజమాని..తన ఇంటికి అడ్డుపడుతున్నాయని మూడు చెట్లను నరికివేశాడు. అయితే...అనుమతి లేకుండా చెట్లు నరికిన యజమానికి అధికారులు భారీ జరిమానా విధించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఓ ఇంటి యజమాని అటవీ అధికారుల అనుమతి లేకుండా మూడు చెట్లు నరికాడు. దీనిపై సీరియస్ అయిన అధికారులు ఆ యజమానికి రూ.39060లు ఫైన్ విధించారు. గత నెల 7న ఆ యజమానికి ఫైన్ విధించగా.. ఈ నెల 9న అమౌంట్ మొత్తాన్ని చెల్లించాడు.