ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అవినీతి పై తన వైఖరిని మరొక్కసారి చాల స్పష్టంగా తెలియజేసారు. ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయిన జగన్ తన పై కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని, అయినప్పటికీ అవినీతి పై పోరాటంలో ఏమాత్రం వెనకడుగు వేయొద్దని తన పార్టీ నాయకులకు ఆయన స్ఫష్టం చేశారు. గత ప్రభుత్వం నిర్వహించిన టెండర్ల దగ్గర నుండీ తీసుకువచ్చిన అప్పుల వరకూ.. ప్రతిదానిలో వందల కోట్ల రూపాయాల్లో కుంభకోణాలు జరిగాయని అందుకే వాటి పై విచారణ జరిపుతున్నామని చెప్పారు. జగన్ ఇంకా మాట్లాడుతూ.. మనం ప్రజాధనానికి కాపలాదారులుగా ఉండాలని.. అప్పుడే అవినీతి చేసినవారి పై మనం పోరాడగలమని.. ఉదాహరణకు గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణంలో బాబు ప్రభుత్వం అవినీతి చేసిందని.. నిజానికి అవినీతి లేకుండా ఉండి ఉంటే.. అదే ఇళ్లు, తక్కువ ఖర్చుకు ప్రజలకు లభించేవి అని జగన్ చెప్పుకొచ్చారు. మొత్తానికి జగన్ దేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతిరహిత పాలన కోసం బాగానే కష్టపడుతున్నాడు. మరి జగన్ అనుకున్నది సాధించగలడా ? ఒక్కటి మాత్రం నిజం. జగన్ తన ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతి జరగటానికి వీలులేదని.. అవినీతి చేస్తే... తన సొంత పార్టీ నాయకుల్ని కూడా ఉపేక్షించేది లేదని.. ఆ ప్రకారం జగన్ ఇప్పటికే కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు.
మరి మొన్న ఎలెక్షన్స్ లో 50 - 60 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ డబ్బు రాబట్టుకోకుండా ఉంటారా ? ఉంటే.. వచ్చే ఎలెక్షన్స్ కి మళ్లీ డబ్బులు ఎలా ? అయినా జగన్ పార్టీ నిలబడటానికి తామూ తొమ్మిది సంవత్సరాలు కష్టపడితే మాకు కలిగిన లాభం ఏమిటి అని వైసీపీ నాయకులు ఆలోచించకుండా ఉంటారా ? అధికారంలోకి వస్తే ఎలాగూ సంపాదించుకోవచ్చు అని గతంలో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. ఇప్పుడు జగన్ వారందరి సంపాదనకు అడ్డుగోడగా నిలబడితే.. వాళ్ళు చూస్తూ ఆగుతారా.. ఖచ్చితంగా వాళ్ళు అవకాశం కోసం కొందరు ఎదురుచూస్తారు. మరికొందరు ప్రత్యర్థి పార్టీలతో లోపాయికారిగా చేతులు కలుపుతారు. అప్పుడు జరిగే పరిణామాలను ఇప్పటికే 1984లో ఎన్టీఆర్ విషయంలో చూశాం. జగన్ నిర్ణయాల పట్ల కొందరి వైసీపీ నాయకుల్లోనే వ్యతిరేకత మొదలైంది. ఆలాగే బడా వ్యాపారులు, దళారులు, ప్రవైట్ వ్యక్తులు బాగా నష్టపోతున్నారు. పైగా బాగా అవినీతికి అలవాటు పడిన అధికారులు ఇప్పటికే లోలోపలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవ్వన్నీ పరిశీలిస్తే.. జగన్ బలమే బలహీనతగా మారుతుందేమో అనిపిస్తోంది.