కృష్ణా నదిలో వరద ప్రవాహం ఎక్కువ ఉండటంతో చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్హౌస్ కు వరద ముంపు ఏర్పడింది. వరదనీరు లోపలకి రానివ్వకుండా సిబ్బంది ఇసుక కట్టలు అడ్డంగా పెట్టారు.కింద ఉన్న ఫర్నీచర్ను అప్పటికప్పుడు పై ఫ్లోర్లోకి మార్చేశారు. చివరకు చంద్రబాబు కాన్వాయ్ను కూడా అప్పటికప్పుడు హ్యాఫీ రిసార్ట్స్లోకి తరలించేశారు.
నది వరద పెరిగినప్పుడు బాబు ఉంటోన్న లింగమనేని గెస్ట్హౌస్లోకి వాటర్ వచ్చే ప్రమాదం ఉందని గతంలో వైసీపీ చెప్పినా వినని బాబు పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడిన ఎలుక మాదిరిగా మారింది. ఈ నేపథ్యంలో కరకట్ట సమీపంలో అక్రమ కట్టడాలు ఉండకూడదని వాటిని ఖాళీ చేయాలని ప్రభుత్వం చెప్పిన చంద్రబాబు పట్టించుకోలేదని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
అప్పుడు ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు హైదరాబాద్ వదిలివచ్చారని.. ఇప్పుడు వరదలకు భయపడి హైదరాబాద్ పారిపోయారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. అలాగే వైఎస్ చేపట్టిన ప్రాజెక్ట్లకు అంచనాలు పెంచి కోట్లు దోచేశారని, పట్టిసీమ పేరుతో రూ. 400 కోట్లు దోచేశారని ఆరోపించారు. పోలవరం పనులు 50 శాతం కూడా పూర్తి కాలేదన్నారు.
అంతకు ముందు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చంద్రబాబు నివాసానికి వరద ప్రవాహ పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీ వరద వస్తుండటంతో చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరుతోందని అన్నారు. దీంతో అక్కడి సిబ్బంది లారీలతో ఇసుక బస్తాలను తరలిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రతిపక్ష నేతగా చంద్రబాబును కాపాడడం మా బాధ్యత అని... ఈ క్రమంలోనే ఇల్లు మునిగిపోతుందని భయంతోనే చంద్రబాబు హైదరాబాద్ కు పారిపోయారని, అలాగే చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు చెందిన వాహనాలను హ్యాపీ రిసార్ట్స్కు తరలించారని తెలిపారు.