అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల పక్షపాతిగా వారి కోసం ఏపీ సీఎం జగన్ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. అమ్మఒడి, పింఛన్ పెంపు వంటి నిర్ణయాలతో వారి మనసు గెలుచుకుంటున్నారు. ఇక ఇప్పుడు సొంత గూడులేని నిరుపేదలను జగన్ కరుణించబోతున్నారు. వచ్చే ఉగాది నాటికి ఏపీలో ప్రతి ఒక్కరికీ ఇళ్లస్థలం ఉండేలా జగన్ చర్యలు తీసుకుంటున్నారు.


అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం రెవెన్యూ శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఉగాది నాటికి ఇళ్లపట్టాలు సంతృప్తికర స్థాయిలో ఇవ్వాలని అధికారులకు సూచించారు.


ఈ సందర్భంగా ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉగాదికి నెలరోజులకు ముందే భూమిని అందుబాటులో ఉంచే ప్రయత్నాలు చేశామని, ఇళ్ల స్థలాల కోసం 23,448 ఎకరాలు గుర్తించామని, ఈ భూములపై పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని జగన్ అధికారులకు సూచించారు.


అధికారులు చెప్పిన దాన్నిబట్టి చూస్తే.. గ్రామాల్లో 20,800 ఎకరాలు, అర్బన్‌ ప్రాంతాల్లో 2,580 ఎకరాలు అందుబాటులో ఉంది. ఈ భూమి ఏ స్థితిలో ఉందన్న దానిపై పరిశీలన చేస్తున్నారు. గ్రామాల్లో దాదాపు 14.06 లక్షల మంది, పట్టణాల్లో 12.69 లక్షలమంది ఇళ్లస్థలాల కోసం ఎదురు చూస్తున్నారని అంచనా. ప్రస్తుతం గుర్తించిన భూమి ద్వారా దాదాపు 9 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వగలుగుతారు. పట్టణాల్లో మరో 2 లక్షలమందికి ఇళ్లస్థలాలు ఇవ్వడానికి భూమి అందుబాటులో ఉంది. దాదాపు 15.75 లక్షలమందికి ఇంకా భూమిని సమకూర్చాల్సి ఉంది. కొత్తగా ఎన్నికైన గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైనవారిని గుర్తిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: