ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. కరకట్ట అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించాడు. చంద్రబాబు కూడా కరకట్టపై నివాసం ఉండటం వల్లే ఆయన్ను జగన్ టార్గెట్ చేశారన్న వాదన ఉంది. జగన్ టార్గెట్ సంగతి ఎలా ఉన్నా.. చంద్రబాబు అక్రమ నివాసంలో ఉండటం ఆయన్ను విమర్శల పాలు చేసింది. చంద్రబాబు ఎలాగైనా అక్కడి నుంచి ఖాళీ చేయాల్సిందే అని పదే పదే వైసీపీ నేతలు మాట్లాడారు.


కానీ ఎవరెన్ని అనుకున్నాసరే.. అక్కడి నుంచి కదిలేది లేదని చంద్రబాబు భీష్మించుకున్నారు. ఏం చేస్తే అదే చేశారని అక్కడి నుంచి కదల్లేదు. నోటీసులు ఇచ్చినా బెదరలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరూ చెప్పకుండానే చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే.. ఇల్లు మునిగిపోతుందన్న భయంతోనే చంద్రబాబు ఇంటిని వదిలి హైదరాబాద్‌కు పారిపోయారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.


ప్రకాశం బ్యారేజీలో వరద ఉధృతి భారీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేయాలని వైసీపీనేతలు సూచించారు. ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఆర్కే పర్యటించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌ హౌస్‌ను ఆయన పరిశీలించారు. కృష్ణా నదీగర్భంలో అక్రమంగా నిర్మించిన నివాసాన్ని చూసి అక్కడి పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.


ప్రతిపక్ష నేతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్కే అన్నారు. ఎగువన గల పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీ వరద వస్తోందని, చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకు లారీలతో ఇసుకను తరలిస్తున్నారన్నారు.


ఇల్లు మునిగిపోతుందన్న భయంతోనే చంద్రబాబు ఇంటిని వదిలి హైదరాబాద్‌కు పారిపోయారని ఆర్కే ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వంలో సరైన వర్షాలు పడక, వరదలు రాలేదు కనుకే ఆయనకు ఇక్కడి పరిస్థితి అర్థంకాలేదని ఆర్కే అన్నారు. భవిష్యత్తులోనైనా చంద్రబాబు నాయుడు అక్రమ కట్టడాన్ని ఖాళీచేయక తప్పదని ఆయన హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: