ఆర్టికల్ 370 రద్దు తరువాత దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జమ్మూ కాశ్మీర్ పైనే అందరి దృష్టి నిలిచింది. దాదాపు 10 రోజుల నుంచి ఆ రాష్ట్రంలో భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. అణువణువును గాలిస్తున్నాయి. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తరువాత జరుగుతున్న తొలి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కావడంతో దీనికి విశేషత కలిగింది.
ఈ వేడుకలకు అక్కడి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం అక్కడ రాష్ట్రపతి పాలన ఉన్నది. గవర్నర్ సత్యపాల్ సింగ్ అక్కడి వ్యవహారాలను చూసుకుంటున్నాడు. సత్యపాల్ సింగ్ షేర్ ఇ కాశ్మీర్లో ఈ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడే రాష్ట్రం గురించిన కొన్ని కీలక విషయాలను ఆయన మాట్లాడబోతున్నారు. అభివృద్ధి గురించి ఆయన ఏం చెప్పబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే, కాశ్మీర్లోని లాల్ చౌక్ లో హోమ్ శాఖా మంత్రి అమిత్ షా జాతీయ జెండా ఎగరవేస్తారని అని టాక్ వచ్చింది. కానీ, అలాంటిది ఏమి లేదని, లాల్ చౌక్ లో జాతీయ జెండా ఎగురవేసేందుకు ఎవరికి అనుమతి ఇవ్వలేదని, ఎవరు కూడా అటువైపు వెళ్లకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తే... తరువాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు.
దేశం నలుమూలల నుంచి 35 మంది యువకులు కాశ్మీర్లోని లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఎగరవేయడానికి వస్తున్నారని వార్తలు వచ్చాయి. దీనిని అక్కడి ప్రభుత్వం ఖండించింది. అలా వస్తే దాని వలన జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రస్తుతం పరిస్థితులు అక్కడ అదుపులోనే ఉన్నాయి. షేర్ ఇ కాశ్మీర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి.