గడచిన 60 రోజుల జగన్మోహన్
రెడ్డి పరిపాలపై ఆందోళనలు చేయటానికి చంద్రబాబునాయుడుకి అవకాశం రాలేదు. అందుకనే
హఠాత్తుగా అన్న క్యాంటిన్లపై దృష్టి పెట్టారు. మూసేసిన అన్న క్యాంటిన్లను
తెరిపించటానికి ఆందోళనలు చేస్తారట. చంద్రబాబు పాలనలో జరిగిన భారీ అవినీతిలో అన్న
క్యాంటిన్ల నిర్వహణ కూడా ఒకటి. ఎన్నికలు మరో ఏడాదిలో ఉందనగా ఏదో మొక్కుబడిగా అక్కడక్కడ
అన్న క్యాంటిన్లను ఏర్పాటు చేశారు.
క్యాంటిన్ల నిర్వహణకు నిర్మించిన గదుల నుండి భోజనం పెట్టటం వరకూ ప్రతి దానిలోను అవినీతే. రెండు పెద్ద గదుల నిర్మాణానికి, ఇతర సౌకర్యాలకు కలిపి ఓ 10 లక్షల రూపాయల్లో అయిపోయేదానికి తమ్ముళ్ళు సగటున 40 లక్షలు బిల్లులు చేశారు. అంటే ప్రతీ క్యాంటిన్ నిర్మాణంలోను తమ్ముళ్ళ జేబుల్లోకి దాదాపు 25 లక్షల రూపాయలు చేరిన విషయం అందరికీ తెలిసిందే.
ఇక భోజనం కూడా నాసిరకమే. కానీ ప్లేటు భోజనానికి వసూలు చేసింది మాత్రం సుమారు 15 రూపాయలు. పోని ఆకలంటూ వచ్చిన వారందిరికీ భోజనం పెట్టారా అంటె అదీ లేదు. ఓ 400 మందికి పెట్టేసి క్యాంటిన్ మూసేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అందరికీ భోజనం పెట్టటం లేదంటూ చాలా చోట్ల నిర్వాహకులతో పేదలు గొడవులు పడిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి.
పాలనలోని చివరి ఏడాదిలో ప్రారంభమైన క్యాంటిన్లను తమ్ముళ్ళు ఆదాయవనరుగానే చూశారు. అందుకనే అధికారంలొకి రాగానే జగన్మోహన్ రెడ్డి క్యాంటిన్లను తాత్కాలికంగా మూసేశారు. అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసి రాజన్న క్యాంటిన్లుగా పేరు మార్చి మళ్ళీ తెరిపించాలన్నది జగన్ ఉద్దేశ్యం. నిజానికి ప్రత్యామ్నాయం చూపకుండా అర్ధాంతరంగా క్యాంటిన్లను మూసేయటం జగన్ ప్రభుత్వం చేసిన తప్పే. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు ఆందోళనలకు పిలుపిచ్చారు. కాబట్టి వీలైనంత తొందరగా మళ్ళీ క్యాంటిన్లను ఏర్పాటు చేసి పేదల కడుపు నింపే పని చేయాలనే అందురు కోరుకుంటున్నారు.