స్టాక్ మార్కెట్లు ఎప్పుడు నిలకడగా ఉంటాయో, లాభాల్లోకి వెళ్తాయో, నష్టాల్లోకి వెళ్తాయో చెప్పలేని పరిస్థితి. ద్రవ్యోల్బణం, బంగారం రేట్లు, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల కారణంగానో స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం లేదా మార్కెట్ కుంగిపోవడం జరుగుతుంది. ఇటివల పరిస్థితులు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు. బంగారం ధర కొంతమేర తగ్గినా మొన్నటి వరకూ మార్కెట్ స్థిరంగానే ఉంది కానీ ఏ మార్పూ లేదు.
ఈ రోజు దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతోనే మొదలయ్యాయి. సెన్సెక్స్ 234 పాయింట్లు కోల్పోయి 37,076 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 10,955 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ ఫ్యూచర్స్ ప్రారంభం ఏమాత్రం ఆశాజనకం కాకపోయినా ఇదే విధంగా ట్రేడ్ అవుతూ 11 తర్వాత కొంత మెరుగవొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటికీ దిగువన ట్రేడ్ అవుతుంటే స్టాప్లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని వాటిని డే చివరలో క్లోజ్ చేసుకోవడం కూడా ఉత్తమమని అంటున్నారు. బుధవారం డాలర్తో రూపాయి మారకం విలువ 71.27 ముగియగా తొమ్మిది పైసలు పెరిగి ఈ రోజు 71.36గా ఉంది. యస్ బ్యాంకు, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా లాభాల్లో కొనసాగుతున్నాయి. హీరో మోటోకార్ప్, మారుతీ సుజుకి, వేదాంతా, టాటా స్టీల్, టాటా మోటార్స్ నష్టాల్లో ఉన్నాయి.
ఈ వారం రోజుల్లో స్టాక్ మార్కెట్లు పుంజుకున్న దాఖలాలు లేవు. ఇన్వెస్టర్లకు నిలకడగా లాభాలనిచ్చే విధంగా షేర్ మార్కెట్ లేదు. రిలయన్స్ ను ఏడాదిన్నరలో రుణరహిత సంస్థగా మారుస్తామని ముఖేశ్ అంబానీ ప్రకటించిన రోజు కూడా రిలయన్స్ షేర్లు కొంతమేర పెరిగాయే కానీ సెన్సెక్స్ మాత్రం కుదేలైంది. నేటితో ఈ వారాంతం స్టాక్ మార్కెట్ ఎలా ముగుస్తుందోనని ఇన్వెస్టర్లు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.