పైకి రాజకీయాలతో సంబంధం లేని అంశంగానే కనిపిస్తున్నప్పటికీ...రాజకీయాలను టచ్ చేస్తున్నట్లుగా ఉన్న ఓ అంశం తాజాగా జరిగింది. బీజేపీ తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం ఇందుకోసం తగు ప్రణాళికతో ముందుకు సాగడం తెలిసిన సంగతే. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీంలో భాగమైన ఓ కేంద్రమంత్రి ఆసక్తికర రీతిలో స్పందించారు. తాజాగా కేంద్రం సమర్థ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పధకం ద్వారా యువతకు దుస్తుల తయారీలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ ఇస్తుంది. ఈ శిక్షణ గురించి ఆషామాషీ ప్రకటన కాకుండా...అచ్చ తెలుగులో ప్రకటించి...తన ప్రత్యేకతను చాటుకున్నారు స్మృతి.
జౌళి రంగంలో వివిధ విభాగాల్లో 2020నాటికి 10 లక్షల మందిని నిపుణులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా సమర్థ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశంలో 16 రాష్ట్రాల్లో అమలు చేయనున్న ఈ పథకంలో భాగంగా యువతకు దుస్తుల తయారీలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ ఇస్తారు. ఇలా శిక్షణ పొందిన యువతకు ఉపాధి కల్పించే మార్గాలను కేంద్ర జౌళి పరిశ్రమ శాఖ చూస్తున్నది. ఇందులో తెలుగు రాష్ట్రాలు భాగం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కూడా ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ 12 వేల మందికి, తెలంగాణ 1440 మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో యువతకు అర్ధం అయ్యేలా ఈ పధకం గురించి స్మృతి ఇరానీ తెలుగులో ట్వీట్ చేశారు. `కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ‘సమర్ధ్’ పథకం కింద ఆంధ్ర ప్రదేశ్ లో 12,000 మంది యువతకు దుస్తుల తయారీ లో నైపుణ్యాలను పెంపొందించుకొనేందుకు శిక్షణ ఇస్తారు`. అని ట్వీట్ చేశారు. దీంతో పాటు చిన్న వీడియోను జతచేశారు. ఈ ట్వీట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.