వరద రాజకీయం ఏపీలో రంజుగా సాగుతోంది. నెల రోజుల క్రితం వరకూ ఏపీలో నీళ్ళు లేవని బురద రాజకీయం చేసింది కూడా టీడీపీనే. ఇపుడు పై నుంచి పొంగి పొరలుతున్న వరద నీటితో ఏపీలోని డ్యాములన్నీ నిండాయి. ఇపుడు ఆ వరద నీరు కడలి వైపు ఉరకలు పెడుతోంది. మరి ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేస్తే వరద నీరు వెల్లువగా పొంగుతూ దూసుకువస్తోంది. దానికి చంద్రబాబు ఇల్లు అన్న తేడా కూడా ఎక్కడా లేదుగా.
అయితే ఏపీలో బురద రాజకీయాన్ని టీడీపీ మూడు నెలల ముందు స్టార్ట్ చేసింది. మొదట ప్రజా వేదికను ఇమ్మని లేఖ రాయడంతో మొదలైన పచ్చ రాజకీయం ఇపుడు పీక్స్ కి చేరింది. ప్రజావేదికను జగన్ ఇవ్వకుండా అది అక్రమమని తేల్చేసి కూలగొట్టారు. దాంతో చంద్రబాబు ఇల్లు తరువాత అనుకున్నారు. ఉండవల్లిలో క్రిష్ణా నది ఒడ్డున కరకట్ట మీద బాబు నివాసం ఉంటున్నారు.
ఆ బిల్డింగ్ లింగమనేని ఎస్టేట్స్ కి చెందినది. మరి ఆ నివాసం అక్రమమైనదని పదే పదే వైసీపీ సర్కార్ చెబుతూ వచ్చింది. నోటీసులు కూడా అంటించింది. కానీ బాబు ఇప్పటికీ ఖాళీ చేయలేదు. ఇపుడు క్రిష్ణమ్మ వరద నీరు ముంచేస్తుందని చెబుతూంటే తమ్ముళ్ళు పని గట్టుకుని మరీ వరద రాజకీయానికి దిగిపోయారు. ఓ మాజీ సీఎం ఇల్లు నీట మునగడం దేశంలో ఇదే ప్రధమం. ఇలాంటి వార్తలు మాత్రం టీడీపీ బయటకు చెప్పదు.
ఇంటి మీద డ్రోన్లు ఎందుకు ఎగురుతున్నాయి. మా ఇంటిని ఎందుకు ఖాళీ చేయిస్తారు ఇలాంటి నిందలతో, ఆరోపణలతో తమ్ముళ్ళు పొద్దు పుచ్చుతున్నారు. చంద్రబాబుకు తెలియదా అది అక్రమ కట్టడమని, ఇపుడు క్రిష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ వస్తూంటే ఆ వరదను కూడా మ్యానిపులేట్ చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా అంటున్నారు. దీని మీద మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివరణ ఇస్తూ ఇలాంటి దిక్కుమాలిన పనులు తమకు చేతకావని అన్నారు. చంద్రబాబు ఇంటికి ముప్పు ఉందని ముందే జగన్ చెప్పారని, అయినా ఆయన వినకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని మంత్రి అన్నారు. మొత్తానికి కరకట్ట మీద బాబు ఇల్లు ఖాళీ చేస్తారా లేక బురద రాజకీయం చేస్తూ పోతారా. ఇదే ప్రశ్న ఇపుడు.