తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పాత చట్టం ప్రకారమే ఎన్నికలకు ఏర్పాటు చేశామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కొత్త మున్సిపల్ చట్టం వివరాలను ప్రభుత్వం హైకోర్టు సమర్పించింది. అభ్యంతరాల పరిష్కారానికి అనుసరించిన విధానాలను హైకోర్టు అడిగింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ కూడా గందరగోళంగా ఉందని, సరైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంటూ.. వీటన్నింటికి సంబంధించి ఈనెల 21వ తేదీలోగా పూర్తి స్థాయిలో మరొక కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది.
పురపాలక ఎన్నికలపై మొదటి రోజుహాట్ హాట్ చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. వార్డుల విభజన, ఓటరు జాబితాలపై అభ్యంతరాలు ఏ విధంగా పరిష్కారం చూపుతున్నారని అడిగింది. ఏ ప్రాతిపాదికన వార్డుల విభజన చేశారని ఏఏజీ రామచందర్ రావును హైకోర్టు ప్రశ్నించగా.. వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం జీవో నెంబర్ 78 ద్వారా పూర్తి చేశామని ఏఏజీ తెలిపారు. ఇప్పటికైతే.. పాత ఆర్డినెన్స్ ద్వారానే మున్సిపల్ ఎలక్షన్స్ జరుపుతామని ఆయన హైకోర్టుకు తెలిపారు. శుక్రవారం నూతన ఆర్డినెన్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను హైకోర్టుకు అందజేస్తామని ఏఏజీ చెప్పారు. దీంతో తదుపరి విచారణను శుక్రవారానికి హైకోర్ట్ వాయిదా వేసింది. తాజాగా జరిగిన వాదనల్లో అభ్యంతరాల పరిష్కారానికి చట్టంలోని విధివిధానాలేమిటని ప్రశ్నించింది.
భోజన విరామ అనంతరం కేసు హైకోర్టులో విచారణకు రాగా, వార్డుల విభజన గందరగోళం, తదితర అంశాలపై అభ్యంతరాలు చెప్పినప్పటికీ వాటిని పరిష్కరిచలేదని పిటిషనర్లు వాదించగా.. అభ్యంతరాలన్నీ ఒక్కరోజులో పరిష్కరించడం సాధ్యం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. విచారణలో భాగంగా కౌంటర్లో పేర్కొన్న అంశాలపై పూర్తి ఆధారాలను ఈనెల 20లోపు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది.