'రాజకీయ చాణక్యుడు' ఇది చంద్రబాబుకు ఉన్న పేరు. రాజకీయాల్లో వ్యూహాలతో ముందుకెళుతూ ప్రత్యర్ధులని చిత్తుచేసే తెలివి తేటలు ఉన్నాయని చంద్రబాబుని చాలామంది రాజకీయ చాణక్యుడు అని అంటారు. కానీ ఇప్పుడు ఆ చాణక్యుడు వ్యూహాలు పని చేయట్లేదు. ఒక్కప్పుడు వ్యూహాలతోనే ముందుకెళితే పార్టీకి ఇంకా నష్టమే కలుగుతుందని అర్ధమవుతుంది. అందుకే టీడీపీకు కూడా ఓ వ్యూహకర్త కావాలని సీనియర్ నేతలు పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.
గత అయిదేళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు చాలా వ్యూహాత్మక తప్పిదాలు చేశారు. ఆ తప్పిదాలకు చాలానే ఉదాహరణలు కూడా ఉన్నాయి. ప్రత్యేకహోదాపై మాట మార్చడం, బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకోవడం, ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ఇలా అనేక కారణాలు చంద్రబాబు వ్యూహాలు ఫెయిల్ అవుతున్నాయని చెప్పడానికి నిదర్శనం.
గతంలో చంద్రబాబు 9 సంవత్సరాల పాటు సీఎంగా పనిచేసినప్పుడు ఆయన క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవారు. ఈ సారి మాత్రం చంద్రబాబును పట్టించుకున్న వారే లేరు. ఆయన మాటలు పార్టీలో జూనియర్లు సైతం లెక్క చేయని పరిస్థితి వచ్చేసింది. ఈ సమయంలోనే వైసీపీ ప్రశాంత్ కిషోర్ ని వ్యూహకర్తగా పెట్టుకుని బలపడింది. ఇక ఎన్నికల్లో అంత భారీ మెజారిటీతో గెలవడానికి పీకే వ్యూహలే ప్రధానం అని చెప్పొచ్చు.
ఇప్పుడు టీడీపీ కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త కోసం పాట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే చంద్రబాబు వ్యూహాలు ఫెయిల్ అవ్వడం, సీనియర్లు ఎవరు మాట వినకపోవడం, లోకేశ్ కి అంత తెలివితేటలు లేకపోవడం వలన తాము కూడా ఓ వ్యూహకర్తని నియమించుకుంటే బాగుంటుందని టీడీపీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఓ మంచి వ్యూహకర్త ఉంటే పార్టీ గెలుపు ఈజీ అవుతుందని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. త్వరగా ఆ దిశగా అధిష్టానం ప్రశాంత్ కిషోర్ లాంటి ఓ తెలివైన వ్యూహకర్తని నియమించాలని కోరుతున్నారు. మరి చూడాలి చంద్రబాబు పార్టీకి వ్యూహకర్తని నియమిస్తారో లేదో?