వైకాపాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై రచ్చ కొనసాగుతుందా? అంటే అవుననే సమాధానం ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పట్ల బహిరంగంగా ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయ చేయకపోయినప్పటికీ , ఎమ్మెల్సీ ఆశావహులంతా అభ్యర్థుల ఎంపిక తీరును తప్పుపడుతూ , తమ సన్నిహితులు వద్ద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం . ఎన్నికలకు ముందు పలువురికి ఎమ్మెల్సీ గా అవకాశం కల్పిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి , ఇటీవల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో గతంలో ఇచ్చిన మాట తప్పారని అంటున్నారు .
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేవలం రాయలసీమకు పెద్దపీట వేసి ఉత్తరాంధ్ర , కోస్తాంధ్ర జిల్లాలను విస్మరించారని విమర్శ కూడా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఎన్నికల ముందు గుంటూరు జిల్లా గురజాల కు చెందిన జంగా కృష్ణమూర్తి కి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చి తన పక్కనే కూర్చోబెట్టుకుంటానని చెప్పిన జగన్ , కేబినెట్ లో అవకాశం కల్పిస్తానని పరోక్షంగా సంకేతాలిచ్చారు. జంగా కృష్ణమూర్తి కి అసలు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడం విస్మయాన్ని కలిగిస్తోందని ఆయన అనుచర వర్గం అంటున్నాయి . ఇక చిలకలూరిపేట స్థానాన్ని రజని కోసం త్యాగం చేసిన మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తానని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారు . గుంటూరు జిల్లా లో పార్టీ ని కాపాడుకుంటూ వచ్చిన లేళ్ల అప్పిరెడ్డి ని సైతం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక లో విస్మరించడం విమర్శలకు తావునిస్తోంది .
ఇక ఎన్నికల ముందు పార్టీలో చేరిన చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి కేటాయించిన జగన్... పార్టీ కోసం ఏళ్లతరబడి కష్టపడి పనిచేసే వారిని విస్మరించడం పట్ల పలువురు నేతలు తమ సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు దాదాపు 70 మంది నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి