తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. ఇప్పటికే అనేకమంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతానికి ఓ నలుగురు,  ఐదుగురు సీనియర్ నేతలు ఉన్నా వారు కూడా  త్వరలోనే పార్టీ వీడేందుకు రెడీ అయ్యారు.  తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్ గౌడ్ త్వరలో బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు విన్పిస్తున్నాయి . బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే దేవేందర్ గౌడ్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది .


దేవేందర్ గౌడ్ కు బీసీ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉండడం , గతం లో  తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఒక వెలుగు వెలిగిన దేవేందర్ గౌడ్ చేరికతో తెలంగాణ లో బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం .   అనారోగ్యం కారణంగా గత రాజకీయాలకు దేవేందర్ గౌడ్ దూరంగా ఉంటున్నారు . క్యాన్సర్ వ్యాధితో బాధపడిన ఆయన అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్నారు. అనారోగ్యం కారణంగానే తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారంలో గానీ, సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో గానీ ఆయన  పాల్గొనలేదు.  ఇకపోతే ఆయన తనయుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు  వీరేందర్ గౌడ్ కూడా  తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.


 తండ్రి దేవేందర్ గౌడ్ తో కలిసి వీరేందర్ గౌడ్ కూడా బీజేపీ లో చేరతారంటూ ఊహాగానాలు విన్పిస్తున్నాయి .  వీరేందర్ గౌడ్ తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు.  అయితే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేకపోవడం, క్యాడర్ సైతం బీజేపీలోకి వెళ్లాలంటూ ఒత్తిడి పెంచుతుండటంతో దేవేందర్ గౌడ్,  తనయుడు వీరేందర్ గౌడ్ తో కలిసి బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: