ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1,26,728 గ్రామ/వార్డ్ సచివాలయాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 11వ తేదీ వరకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకున్నారు. . 21 లక్షల 69 వేల 719 మంది అభ్యర్థులు గ్రామ/వార్డ్ సచివాలయాల ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసినట్లు సమాచారం. ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసిన అభ్యర్థులలో ఎక్కువ శాతం మంది పోస్టు గ్రాడ్యుయేట్లే ఉన్నట్లు తెలుస్తోంది. 
 
9,11,282 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు గ్రామ/వార్డ్ సచివాలయాల ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసుకున్నారు. 8,24,493 మంది గ్రాడ్యుయేట్లు, 4,33,944 మంది ఇంజనీరింగ్ అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నారు. మొత్తం ధరఖాస్తుల్లో పోస్టు గ్రాడ్యుయేట్లు 42 శాతం కాగా, గ్రాడ్యుయేట్లు 38 శాతం, ఇంజనీరింగ్ అభ్యర్థులు 20 శాతంగా ఉన్నారు. ఈ నెల 25వ తేదీ నుండి ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకున్న వారికి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. 
 
వీరికి వచ్చే నెల 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు రాత పరీక్షలు నిర్వహించబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుండి అత్యధికంగా 2 లక్షల 5 వేల 292 ధరఖాస్తులు రాగా ఆ తరువాత స్థానాల్లో విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. గ్రామ/ వార్డ్ సచివాలయాల ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు కావటంతో భారీ స్థాయిలో ధరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. 
 
ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువగా కేటగిరీ 3 లోని ఉద్యోగాలపై ఆసక్తి చూపించగా, పోస్టు గ్రాడ్యుయేట్లు అన్ని కేటగిరీల్లోని పోస్టులపై ఆసక్తి చూపిస్తున్నారు. గ్రాడ్యుయేట్లు ఎక్కువగా కేటగిరీ 1లోని ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరుగుతూ ఉండటంపై నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 2 వ తేదీ నుండి గ్రామ/వార్డ్ సచివాలయాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. 


 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: