తెలిసీ తెలియని వయస్సులో తప్పు చేసిన మైనర్ బాలికను కుల పంచాయతీ పేరుతో గొడ్డును బాదినట్టు బాదారు. గ్రామ కట్లుబాట్లు అంటూ నేటి కాలపు మనుషులు కూడా మతి తప్పినట్లు ప్రవర్తించారు. ప్రేమించుకున్న పాపానికి ఇద్దరు దళిత మైనర్లను పంచాయతీకి పిలిపించి కర్ర దెబ్బలు, కాలిదెబ్బలతో బహిరంగ శిక్ష వేశారు. గ్రామం మొత్తం చూస్తుండగా ఇద్దరు మైనర్లను విశాక్షణారహితంగా కొట్టారు.


ఈ దారుణం అనంతపురం జిల్లా.. గుమ్మగట్ట మండలం కెపి దొడ్డి గ్రామంలో జరిగింది. కొంతమంది గ్రామస్తులు పంచాయతీ పెద్దలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకో పోలీసులు కూడా ఈ ఘటన పై మౌనం వహించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.


ప్రేమించుకుని ఊరొదిలి వెళ్లిన జంటను మళ్లీ పట్టుకుని ఊరికి తీసుకొచ్చి గ్రామం నడిబొడ్డున పంచాయితీ పెట్టే సన్నివేశాలు సినిమాల్లోనే కాదు.. ఇక్కడ నిజంగానే జరిగింది. గుమ్మఘట్ట మండలం కేపీదొడ్డి గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమికులు పది రోజుల క్రితం గ్రామం వదిలి వెళ్లిపోయారు. ఇరువురి తల్లిదండ్రులు వారిని స్వగ్రామానికి రప్పించి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అక్కడ గ్రామ పెద్ద తన ప్రతాపం చూపాడు. బాలిక చెప్పిన మాట వినలేదని... మాజీ ఎంపీటీసీ లింగప్ప బాలికపై చేయి చేసుకున్నాడు.


పదేపదే కాలితో కర్కశంగా తన్నాడు.. కర్రతో పశువును బాదినట్లు చావబాదాడు. చుట్టూ వంద మంది వరకూ ఈ వింతను చోద్యం చూసినట్టు చూశారే కానీ.. ఒక్కరూ అడ్డుపడలేదు. పోలీసులు మాత్రం సోషల్ మీడియాలోనే చూశామని.. ఇప్పటి వరకూ తమ దృష్టికి రాలేదని అంటున్నారు. ఇప్పుడు మీడియాలోనూ ఈ దృశ్యాలు హల్ చల్ చేస్తుండటంతో ఇకనైనా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. తెలిసీ తెలియని వయస్సులో పిల్లలు తప్పు చేస్తే.. వారిని ఇలా చిత్రహింస పెడితే.. ఇక పెద్దల విచక్షణ ఏమైనట్టు.. వారి పెద్దరికం ఏ గంగలో కలసినట్టు..?


మరింత సమాచారం తెలుసుకోండి: