దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని క్షేత్ర స్థాయి లో విస్తరించాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం దీర్ఘ కాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది . ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ , జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించడం లో సక్సెస్ అయినా బిజెపి నాయకత్వం యడ్యూరప్ప సర్కారును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కర్ణాటక లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఆ పార్టీ నాయకత్వం పెద్ద స్కెచ్ వేసింది . తమిళనాడు లో ఇప్పటికీ, ఇప్పుడు వర్కౌట్ అయ్యే పరిస్థితులు లేకపోవడంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పాగా వేయాలన్న బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహంగా కన్పిస్తోంది .
మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం చేసే దిశగా బీజేపీ జాతీయ నాయకత్వం పావులు కదుపుతున్న తీరు చూస్తుంటే 2024 ఎన్నికల నాటికి ఈ రెండు రాష్ట్రాల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బ తీయాలని పట్టుదలతో కమలనాథులు అడుగులు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలను బిజెపి లో చేర్చుకునే కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతోంది. ఇటీవలే మధ్యప్రదేశ్ సీఎం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి పార్టీ రాష్ట్ర నాయకులు చేరికలపై దిశానిర్దేశం చేసి వెళ్లారు .
దీంతో ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు పార్టీల ప్రముఖులను కమలం పార్టీలో చేర్చుకోవడంపైనే బిజెపి అగ్రనాయకత్వం ప్రధానంగా దృష్టి సారించింది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నేపధ్యం లో ఎవరెవరు కమలం గూటికి చేరడానికి అవకాశం ఉందన్న దానిపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు , ఎంపీలు ఇప్పటికే బిజెపిలో చేరగా, ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీ లో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ లో బీజేపీ లో చేరికల జోరు పెరిగింది. ఈనెల 18న తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు బిజెపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన ఒక మాజీ డిప్యూటీ సీఎం , పలువురు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరే అవకాశం ఉందని కమలనాధులు చెబుతున్నారు.