ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. వారంరోజుల పర్యటనకోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వాషింగ్టన్‌ డీసీ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు అరుణిష్‌ చావ్లా, నికాంత్‌ అవహద్‌ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. టీటీడీ ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తెలుగు సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.


వాషింగ్టన్‌డీసీలో యూఎస్‌ ఛాంబర్‌ఆఫ్‌ కామర్స్‌ కీలక సమావేశానికి సీఎం హాజరయ్యారు. అక్కడ భారత రాయబారి హర్షవర్ధన్‌ ష్రింగ్లాతో సీఎం సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో అంతర్జాతీయ వ్యవహారాల సీనియర్‌ వైస్‌ ప్రెశిడెంట్‌ రాబ్‌ ష్రోడర్‌ మొదట ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.


ఇటీవల ఎన్నికల్లో వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి ఘనవిజయాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడ్డ బలమైన నాయకత్వం అమెరికా– ఆంధ్రప్రదేశ్‌ మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. 5 ట్రిలియన్‌ ఎకానమీ చేరుకోవాలన్న భారత్‌ ఆకాంక్షకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆరోగ్యరంగాన్ని గాడిలోపెడుతున్నామని, ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిని పెద్ద ఎత్తున అభివృద్ధిచేస్తున్నామని వెల్లడించారు.


తర్వాత రాయబారి హర్షవర్దన్‌ మాట్లాడుతూ గడచిన ఎన్నికల్లో వైయస్‌.జగన్‌ ఘన విజయం సాధించారని, ఇంత మెజార్టీ రావడం చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సంస్థలు, వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ సరైన రాష్ట్రమని హర్షవర్దన్‌ పేర్కొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పీవీ రమేష్‌ కొన్ని కీలక అంశాలను వివరించారు. విద్యుత్‌ ఒప్పందాల పునఃసమీక్షతో విద్యుత్‌ పంపిణీ సంస్థలు నిలదొక్కుకుంటాయని, తద్వారా పరిశ్రమలపై విద్యుత్‌ ఛార్జీల భారం తగ్గుతుందని వివరించారు.


పాదయాత్రద్వారా మఖ్యమంత్రి 2.2 కోట్ల మంది ప్రజలను స్వయంగా కలుసుకుని, సమగ్ర మానవాభివృద్ధికి అవసరమైన అంశాలను గుర్తించి, వాటిని అమలుచేస్తున్నారని వివరించారు. అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వాన్ని అందించడానికి సీఎం వైయస్‌.జగన్‌ అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. కాంట్రాక్టుల్లో, ప్రభుత్వ కొనుగోళ్లలో అత్యుత్తమ పారదర్శకత విధానాలు ప్రవేశపెట్టారని ప్రతినిధులకు వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: