దొంగ ఓట్లను అరికట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఎన్నికలను పారదర్శకంగా జరిపించడానికి ఈసీ తీసుకున్న నిర్ణయాలు పెద్దగా ఫలించలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా భారీగా బోగస్ కార్డులు బయట పడ్డాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కొన్ని లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయి.
ఇక ఈవిషయాల ఫై సీరియస్ గా ద్రుష్టి పెట్టిన ఈసీ బోగస్ కార్డుల ఏరివేతకు మాస్టర్ ప్లాన్ వేసింది. అదేంటంటే ఓటర్ గుర్తింపు కార్డు కు ఆధార్ నెంబర్ ను అనుసంధానం చేయాలని న్యాయశాఖకు లేఖ రాసింది ఈసీ. దీనివల్ల నకిలీ దరఖాస్తులను అలాగే బోగస్ ఓట్లను సులభంగా తొలిగించవచ్చునని ఆ లేఖ లో పేర్కొంది. ఈ అంశంపై ఎన్నికల సంఘం న్యాయ శాఖకు లేఖ రాయడం ఇదే తొలిసారి. దీంతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950కి మార్పులు చేయాలని కూడా ఈసీ ప్రతిపాదించింది. ఓటర్ ఐడి కి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడం వల్ల ఒక్కొక్కరినీ ఒక్క ఓటుకు మాత్రమే పరిమితం చేయవచ్చునంటూ ఈసీ గతంలో చెప్పింది. కాగా ఇప్పటికే 32 కోట్ల ఆధార్ నంబర్లు ఓటర్ ఐడీ కార్డులతో లింక్ అయ్యాయి.
ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆధార్ కార్డు ప్రాముఖ్యత మరింత పెరగనుంది . ఇటీవల పాన్ కార్డు స్థానంలో ఆధార్ కార్డును వాడుకోవచ్చని ఆర్థిక శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనివల్ల , పాన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డుతో పన్ను చెల్లించొచ్చు. ఎక్కడెక్కడ పాన్ కార్డు నంబర్ అవసరం అవుతుందో అక్కడ ఆధార్ కార్డు నంబర్ ఇవ్వొచ్చు. ఇక ఇప్పుడు ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంతో భవిష్యత్తులో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుంటుంది.