ఏపీలో ప్ర‌స్తుతం డ్రోన్ రాజ‌కీయం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నివాసం వ‌ద్ద చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పై అధికార వైసీపీ, ప్ర‌తిపక్ష టీడీపీ విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నాయి. ఈ స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కృష్ణా నది వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు అగచాట్లుపడుతుంటే వారికి సహాయం చేయకుండా మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరకట్ట చుట్టూ తిరగడం శోచనీయమ‌ని మండిప‌డ్డారు. తాజాగా విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

 

``వరద ఉధృతి ఉన్నప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడటం ప్రభుత్వం విధి. కరకట్ట మీద ఉన్న నిర్మాణాలు మునిగిపోతాయా లేదా అంటూ డ్రోన్లు ఎగరేసి చూడటమా మంత్రుల బాధ్యత. కరకట్ట మీద ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రెండు రోజులపాటు బస చేసిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు గృహం, అదే వరుసలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంతో పాటు ప్రముఖుల ఇళ్ళు, శారద పీఠం కార్యక్రమం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళిన ఆశ్రమం ఉన్నాయి. వరద ఉధృతి పెరిగితే అన్నీ మునుగుతాయి. డ్రోన్ రాజకీయాలు అక్కర్లేదు.`` అని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 

 

లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కాపాడి, వారికి కావల్సిన అన్ని రకాల సహాయాలు చేయాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోరారు. ``మాజీ ముఖ్యమంత్రి ఇంటిని ముంచేస్తారా అని ప్రతిపక్షం, మునిగిందా లేదా అని చూసేందుకు అధికార పక్షంవాళ్లు వెళ్ళి రాజకీయాలు చేస్తూ బాధల్లో ఉన్న ప్రజలను వరద నీటికి వదిలేశారు. రాజకీయాలు, కక్ష సాధింపులు ఏవైనా ఉంటే తరవాత చేసుకోండి. ఇది విపత్కాలం. వరద బాధల్లో ఉన్న పేదలను కాపాడండి. `` అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. 

 

151 సీట్లు వచ్చిన అధికార పార్టీ ప్రజల పట్ల బాధ్యతతో సుపరిపాలన అందించాలని ప‌వ‌న్ కోరారు. `విమర్శలకు తావిచ్చేలా వ్యవహరించడం తగదు. జనసేన ఎప్పుడూ రాజకీయాల్లో హుందాతనం పాటించాలనే కోరుకొంటుంది. జగన్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో విమానాశ్రయంలో దాడి జరిగినప్పుడు ఆయనకు ప్రభుత్వం తగిన భద్రత ఇవ్వాలని జనసేన స్పష్టంగా చెప్పింది. నాటి పాలకపక్ష నేతలు ఆ దాడి జగన్ తల్లి చేయించారని ఆరోపణలు చేస్తే - ఆ విధంగా మాట్లాడటం సరికాదని తప్పుబట్టి, ఏ కన్న తల్లీ తన బిడ్డను చంపించుకోవాలి అని చూడదని, అలాంటి కువిమర్శలు తగవని చెప్పాను. వరద వేళ సాయం చేరడంలేదని ప్రజలు వాపోతున్నారు. రాజకీయాలు కొద్ది రోజులు పక్కనపెట్టి ముంపు బాధిత ప్రాంత ప్రజలకు, రైతులకు సహాయం చేయండి`` అని ప‌వ‌న్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: