సభ్య సమాజం తలదించుకునేలా అనంతపురం జిల్లాలో రాయదుర్గం పరిధిలో నడిరోడ్డుపై కుల పంచాయతీ జరిగిన సంగతి తెలిసిందే. ప్రేమించిన పాపానికి ఓ అమ్మాయిపై పాశవికంగా దాడి చేశారు. అమ్మాయని చూడకుండా మైనర్ బాలిక పట్ల పరుషంగా ప్రవర్తించిన ఆ ఊరిపెద్దకు తగిన శాస్తి జరిగింది. గ్రామ పెద్దపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనలో గ్రామ పెద్ద, మాజీ ఎంపీటీసీ లింగప్పను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.
కేపీ దొడ్డి గ్రామానికి చెందిన దళిత యువతీయువకులైన వన్నూరమ్మ, బాబు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం వారు తమ గ్రామం నుంచి పారిపోయారు. మొత్తానికి గ్రామస్తులు వారిని కేపీ దొడ్డికి తీసుకువచ్చి శుక్రవారం ఉదయం ఎస్సీ కాలనీలో పంచాయతీ పెట్టారు. ఈ పంచాయతీకి గ్రామపెద్ద, రాజకీయ నాయకుడు లింగప్ప వచ్చాడు. ఇక లింగప్ప మాట్లాడుతూనే బాలికపై చేయి చేసుకున్నాడు. బాలిక చెంపలపై గట్టిగా కొడుతూ.. ఆమె కిందపడిపోగా.. గుండెలపై తన్నాడు లింగప్ప. అంతటితో ఆగకుండా కర్రతో కూడా చితకబాదాడు. ఈ సమయంలో అక్కడ ఊరు మొత్తం ఉన్నా కూడా కళ్లప్పంగి చూశారే తప్ప.. ఏ ఒక్కరూ ఆపడానికి ప్రయత్నించలేదు. బాలికను లింగప్ప కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదిలాఉండగా,కేపీ దొడ్డిలో డీఎస్పీ వెంకటరమణ ప్రత్యక దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడి సమగ్ర వివరాలు సేకరించారు. బాలికను కొట్టే సమయంలో రచ్చబండపై ఉన్నవారిని కూడా విచారించి వారిపైనా కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. గ్రామపెద్ద, మాజీ ఎంపీటీసీ లింగప్ప రిమాండ్కు తరలించనున్నట్లు వెల్లడించారు. బాలికతో శారీరకంగా కలిశాడన్న ఆరోపణలతో బాలుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.