రాజకీయాల్లో ఇపుడు అన్నీ మామూలే. ఎందుకంటే వర్తమానం అలా ఉంది. ఓపెన్ ఆఫర్ ఇచ్చి మరీ కండువాలు కప్పేస్తున్న సీజన్ నడుస్తోంది. అందువల్ల ఎవరు ఎవరినైనా పిలవవ‌చ్చు. ఎవరు ఎక్కడికైనా  దర్జాగా చేరిపోవచ్చు. ఉన్న పద‌విని కూడా అట్టేబెట్టుకుని మరీ దూకేయవచ్చు. అయితే అవత‌లాయన మనసులో ఏముందో కనుగొన్నారో ఏమో కానీ బీజేపీ నేత ఒకరు మా పార్టీలోకి వచ్చేయండి హ్యాపీగా అంటూ టీడీపీ ఎమ్మెల్యేను మీడియా సాక్షిగా పిలిచేస్తున్నారు.


విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉత్తర నియోజకవర్గం ఉంచి గెలిచారు. అయితే ఆయన అటు  టీడీపీ కార్యక్రమాల్లో ఎక్కడా  పార్టిసిపేట్ చేయడంలేదు. ఇక అసెంబ్లీలో కూడా గంటా తన  వాయిస్ వినిపించలేదు. ఆయన ఎందుకో మౌనంగా ఉంటున్నారు. మరి ఇదే ఉత్తరం సీటు నుంచి బీజేపీ అభ్యర్ధిగా గంటాతో పోటీ పడిన మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఇపుడు ఓపెన్ గా గంటాను తన పార్టీలోకి రావాలని పిలుస్తున్నారు. మీరు మా పార్టీలోకి రండి నాకేం అభ్యంతరం లేదు అని కూడా చెప్పేస్తున్నారు.


అయితే ఒక షరతు. మా పార్టీలోకి వచ్చినా మీ పార్టీలోనే ఉన్నా సరే ప్రజా సేవ మాత్రం మరవకండి అంటూ సెటైర్లు మాత్రం వేశారు. ప్రజలకు ముఖం చూపించకపోతే అలా అంటూ గంటాను గట్టిగా నిలదీశారు. గంటా ప్రజా సమస్యలపై ఎక్కడా మాట్లాడడం లేదని విమర్శించారు. మీరు ప్రజా దర్బార్లు పెట్టండి, జనం పడుతున్న బాధలు తెలుసుకోండి అంటూ  సూచనలు ఇచ్చారు రాజుగారు.


ఇవన్నీ ఇలా ఉంటే తన మీద గంటా గెలవడానికి కారణం డబ్బు ప్రభావం మాత్రమేనని రాజు గారు అనడం విశేషం. తన వద్ద డబ్బు దండీగా లేదు కాబట్టే ఓడిపోయాను అంటూ బీజేపీ నేత అనడం ద్వారా గంటా గెలుపు ధనబలమేనని తేల్చేశారు. ఓ వైపు పార్టీలోకి రమ్మని పిలుస్తూనే మరో వైపు గట్టిగానే రాజు గారు కౌంటర్లేయడం బట్టి చూస్తే  బీజేపీ నేత రాజ‌కీయం బాగానే ఉందనిపిస్తోంది కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: