ఏపీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ ఖాయమైంది. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఏపీలోని టీడీపీకి చెందిన నేతలను తన గూటికి చేర్చుకుంటున్న బీజేపీ మరో ప్రముఖుడికి కండు కప్పనుంది. ఏపీకి చెందిన టీడీపీ కీలక నేతలు సైతం కమలం గూటికి చేరగా తాజాగా కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం ఇదే దారిలో ఉన్నారు. తెలంగాణ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను ఆదినారాయణరెడ్డి కలిశారు.
గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు సైతం ఆదినారాయణరెడ్డి దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల సమయంలో, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరుతో ఆదినారాయణరెడ్డి గుర్రుగా ఉన్నారని, అందుకే పార్టీకి అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారనే ప్రచారం జరిగింది. దీంతో పాటుగా ఆయన బీజేపీ గూటికి చేరనున్నారని సైతం వార్తలు వచ్చాయి. దాన్ని నిజం చేస్తూ...బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్తో కలిసి ఇవాళ హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిన ఆదినారాయణరెడ్డి.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో మంతనాలు జరిపారు. కాగా, ఈ ప్రచారంపై ఇటు రామసుబ్బారెడ్డి, అటు బీజేపీ అధికారికంగా స్పందించలేదు.
కొన్నాళ్లుగా బీజేపీలో చేరతారంటూ ప్రచారం సాగుతున్నప్పటికీ దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా, జేపీ నడ్డాతో సాక్షాత్తు బీజేపీ కార్యాలయంలోనే ఆదినారాయణరెడ్డి సమావేశం కావడంతో.. ఆయన త్వరలోనే బీజేపీలో చేరడం ఖాయమంటూ జరుగుతోన్న ప్రచారానికి తెరపడింది, అధికారికంగా కండువా కప్పుకోవడమే మిగిలిపోయింది. కాగా, ఆదినారాయణరెడ్డితో బీజేపీలో చేరితే.. రాయలసీమ ప్రాంతం నుంచి మరికొందరు నేతలు బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఆది చేరిక తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.