భారతదేశం చరిత్ర సృష్టించింది.జూలై 22న శ్రీహరికోట నుంచి చంద్రయాన్2 ఎగిరిన విషయం తెలిసిందే. సుమారు 30 రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాన్ 2 నిర్ధేశిత కక్ష్యలోకి చేరుకుంది. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఈ ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 2 ఉపగ్రహం వేగాన్ని ఓరియెంటేషన్ ప్రక్రియ ద్వారా తగ్గించి చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ ప్రక్రియ ఇవాళ ఉదయం 9 గంటల 2 నిమిషాలకు మొదలైందని ఇస్రో తన ట్వీట్లో వెల్లడించింది. సుమారు 1738 సెకన్ల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది.
చంద్రయాన్ 2 వ్యోమనౌక సుమారు 39 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లింది. ఇది ధ్వని వేగం కన్నా 30 రేట్లు ఎక్కువ. 114 km x 18072 కిలోమీటర్ల ఎత్తులో చంద్రయాన్2 తన కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రుడి ఉపరితలానికి వంద కిలోమీటర్ల ఎత్తులో , సుమారు 100 km X 30 కిలోమీటర్ల దూరంలో త్వరలో చంద్రయాన్2 మరికొన్ని కీలక ప్రక్రియలు నిర్వహిస్తుంది. ఇక్కడే ఆర్బిటార్ నుంచి విక్రమ్ ల్యాండర్ వేరుపడనుంది. ఆ తర్వాత చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగుతుంది. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడి దక్షిణ ద్రువంపై ల్యాండర్ దిగుతుంది.
ఆగస్టు 21, 28, 30న చేపట్టే ఈ ప్రయోగాల ద్వారా చంద్రయాన్-2 చంద్రునికి చేరువగా ఉండే చివరి కక్ష్యలోకి చేరుకుంటుంది. అనంతరం సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 1:30 గంటల నుంచి 2:30 గంటల మధ్యలో లాండర్ సహాయంతో చంద్రునిపై ల్యాండ్ అవుతుంది. లాండర్ ల్యాండ్ అయిన 4 గంటల తరువాత అందులో ఉన్న రోవర్ చంద్రుని మీదకు దిగుతుంది. సెకను సెంటీమీటర్ చొప్పున ప్రయాణిస్తూ.. అక్కడి స్థితిగతులను భూమిమీదకు పంపుతుంది. అక్కడి నుంచి సమాచారం భూమిమీదకు చేరడానికి 15 నిమిషాల సమయం పడుతుంది.