పాకిస్తాన్ తో యుద్ధం చేయడానికి భారత సైన్యం సిద్ధపడిందా.. పాక్ తో అమీ తుమీ తేల్చుకునేందుకు మేం రెడీ అంటూ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా తేల్చి చెప్పిందా.. మోడీ సర్కారు ఓకే అంటే చాలు.. పాకిస్తాన్ లోకి చొచ్చుకెళ్లి తగిన బుద్ది చెప్పేందుకు భారత్ సైన్యం అన్నివిధాలా మానసికంగా సిద్ధపడిపోయిందా.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.
అయితే ఇది ఇప్పటి మాట కాదు.. పుల్వామాలో ఉగ్రవాద దాడి తర్వాత జరిగిన ఘటన.. కాస్త ఆలస్యంగా ఈ సమాచారం బయటకు వచ్చింది. పదవీ విరమణ పొందుతున్న పలువురు సైనికాధికారులతో తాజా సమావేశమైనప్పుడు బిపిన్ రావత్ ఈ విషయాన్ని బయటపెట్టారట. పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై పూర్తిస్థాయి యుద్ధం చేయాడానికి భారత సైన్యం అప్పట్లో సిద్ధపడిందట.
భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ కేంద్ర ప్రభుత్వం ముందు యుద్ధం ప్రతిపాదన ఉంచారట.. పాకిస్థాన్లోని బాలాకోట్పై మన వైమానిక దళం దాడి చేయడానికి ముందు భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించారట కూడా. ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాద దాడి ఘటన తర్వాత భారత్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. పాక్ కు ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచించింది. అందుకు భారత్ ముందు ఉన్న మార్గాలను అధ్యయనం చేసింది.
చివరకు పాక్ గగన తలంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో ఇండియన్ ఆర్మీ తన యుద్ధ సన్నద్ధతను తెలియజేసిందట. సాధారణంగా శాంతిని కోరుకునే ఇండియా.. పుల్వామా దాడి తర్వాత కూడా శాంతి మంత్రం జపిస్తే.. దాన్ని పాక్ ఇండియా చేతగాని తనంగా భావించే అవకాశం ఉంది. అందుకే ఏదో ఒక రూపంలో దాడి చేయాల్సిందేనేని భారత్ నిర్ణయించింది.
అయితే భూతల యుద్ధానికి దిగితే అది పూర్తి స్థాయి యుధ్ధంగా మారే ప్రమాదం ఉంది కనుక సంయనమం పాటించింది. బాలకోట్ గగన తల దాడులతో పాక్ కు బుద్ధి చెప్పి అంతటితో సరిపెట్టింది. ఆ తర్వాత పాక్ కూడా పెద్దగా ప్రతిదాడులు చేయకపోవడంతో భారత్ కూడా సంయమనం పాటించింది.