మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పురిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. మూడు వందల యాభై నాలుగు కోట్ల మేర సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేసిన కేసులో రతుల్ పురిని ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఈరోజు కోర్ట్ ముందు హాజరుపరచనున్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నమోదు చేసిన కేసుకు సంబంధించి మోజర్ బేర్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రతుల్ పురి ఇతరులపై సిబిఐ కేసు నమోదు చేసింది.


నిందితులైన మాజీ డైరెక్టర్ల నివాసాలు కార్యాలయాలపై సిబిఐ గత ఆదివారం దాడులు జరిపింది. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ అవినీతి ఆరోపణల కింద రతుల్ ఆయన తండ్రి దీపక్ పూరి ఇతర డైరెక్టర్ లు నీతా పూరి , సంజయ్ జయన్ , వినీత్ శర్మపై కేసును నమోదు చేసింది . కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి రతుల్ 2012లో రాజీనామా చేయగా, ఆయన తల్లితండ్రులు బోర్డులో కొనసాగుతున్నట్టు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.



కాంప్యాక్ డిస్క్ లు, డీవీడీలు, సోలిస్ డెడ్ స్టోరేజ్ డివైజ్ లు వంటి ఆప్టికల్ స్టోరేజ్ ఉత్పత్తులను రతుల్ పురి కంపెనీ తయారు చేస్తూ వచ్చింది. 2009 నుంచి వివిధ బ్యాంకుల నుంచి పలుమార్లు ఆ కంపెనీ రుణాలు తీసుకుని వాటిని చెల్లించక పోవటంతో ఫోరెన్సిక్ ఆడిట్ జరిపి అది ఫ్రాడ్ అకౌంట్ గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఫోర్జరీ తప్పుడు డాక్యుమెంట్ లతో ఆ కంపెనీ డైరెక్టర్ లు బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్టు ఆరోపించింది. దీంతో 2014 నవంబర్ 29 వరకు 354 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని బ్యాంక్ ఫిర్యాదు చేసింది


మరింత సమాచారం తెలుసుకోండి: