జెఫ్రీ ఎప్స్టీన్...అమెరికాలో మేటి ఫైనాన్సర్గా ఎప్స్టీన్కు గుర్తింపు ఉంది. అతనికి ఆ దేశ మేటి రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్నాయి. అతని ఫ్రెండ్స్ లిస్టులో బిల్ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ ఉన్నారు. అలాంటి వ్యక్తి...అనేక మంది మైనర్ అమ్మాయిలను అత్యాచారం చేశాడని ఎప్స్టీన్పై ఆరోపణలు ఉన్నాయి. సెక్స్ ట్రాఫికింగ్ కేసులో అతను జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ఒకవేళ కేసులో దోషిగా తేలితే అతనికి కనీసం 45 ఏళ్ల శిక్షపడేది. అయితే ఇటీవల న్యూయార్క్ పట్టణంలోని మన్హట్టన్ జైలులో ఎప్స్టీన్ అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక సహజంగా మరణించాడా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే, జెఫ్రీ ఎప్స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది. అయితే, ఆయన మరణం విషయంలో సంచలన అంశాలు తెరమీదకు వచ్చాయి.
వందలాది డాలర్లను ఎర చూపి ఎప్స్టీన్ అనేక మంది అమ్మాయిలను అనుభవించాడన్న ఆరోపణలు ఉన్నాయి. అనేక మంది మైనర్ అమ్మాయిలను అత్యాచారం చేశాడని కూడా కొందరు విమర్శించారు. అతన్ని గత జూలైలో అరెస్టు చేసి జైలుకు తీసుకువెళ్లారు. కానీ ఎప్స్టీన్ జైలులో సూసైడ్కు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతనిపై నిఘా కూడా పెట్టారు. కానీ ఎప్స్టీన్ మృతికి ముందు ఆ నిఘాను ఎత్తివేశారు. జైలు సెల్లోనే అతని శవాన్ని పోలీసులు గుర్తించారు. జైలు బోనులో ఎప్స్టీన్ మృతి చెందడం ఓ మిస్టరీగా మారింది. కొందరు సేనేటర్లు ఆయన మృతి పట్ల విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జైలు అధికారులు ఏం చూస్తున్నారని ప్రశ్నించారు. భారీగా ముడుపులు ముట్టడం వల్లే ఎప్స్టీన్ మృతిని జైలర్లు పట్టించుకోలేదన్న వాదనలు వినిపించాయి. 66 ఏళ్ల ఎప్స్టీన్ను ప్రతి అరగంటకు ఒకసారి జైలు గార్డ్స్ చెక్ చేయాలి. కానీ అతను చనిపోయిన రోజున అతన్ని ఎవరూ చెక్ చేయలేదు. దీంతో ఆ మరణం వెనుక జైలర్ల పాత్ర ఉన్నట్లు అనుమానించారు. కాగా, ఎప్స్టీన్ ఉన్న జైలులో అవకతవకలు ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల గుర్తించారు. ఆ జైలులోనే హై ప్రొఫైల్ నేరస్తులు ఉన్నారు. మెక్సికో డ్రగ్ డాన్ ఎల్ చాపో, పాంజీ స్కీమ్ మోసగాడు బెర్నీ మాడాఫ్ కూడా ప్రస్తుతం ఆ జైలులోనే ఉన్నారు.
ఇలా సర్వత్రా చర్చనీయాంశంగా మారిన ఎప్స్టీన్ మృతిపై వ్యక్తమైన అనుమానాలకు డాక్టర్లు చెక్ పెట్టారు. జైలు సెల్లో అతను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు న్యూయార్క్ డాక్టర్లు తేల్చారు.
మరోవైపు, సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అతను ఉరివేసుకోవడానికి రెండు రోజుల ముందే వీలునామా రాసినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ పోస్టు పత్రిక దీనికి సంబంధించిన కథనాన్ని ప్రచురించింది. ఆగస్టు 8వ తేదీన వీలునామా రాశాడు. దాదాపు 577 మిలియన్ల డాలర్లు.. అంటే సుమారు రూ.4000 కోట్ల ఆస్తిని ఓ ట్రస్టుకు రాసి ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలాఉండగా, ఎప్స్టీన్పై నష్టపరిహారం కేసులు వేసిన అమ్మాయిలు గగ్గోలుపెడుతున్నారు. ఎప్స్టీన్ నుంచి నష్టపరిహారం కోరేందుకు కోర్టులో పోరాడనున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు.