అక్బరుద్దీన్..ఈ పేరు వినగానే ఉద్వేగ ప్రసంగాలు చేసే మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గుర్తొస్తారు. కానీ ఇది ఆగస్టు 16కు ముందు. ఇప్పుడు అక్బరుద్దీన్ అనగానే ఓవైసీతో పాటు ఇంకొకరు గుర్తుస్తారు. ఆయనే సయ్యద్ అక్బరుద్దీన్. ఐక్యరాజ్యసమితిలో భారత్ అధికార ప్రతినిధి. ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ పునర్ వ్యవస్థీకరణపై భారత్ వాణిని ఐక్యరాజ్యసమితిలో సమర్థంగా వినిపించడమే కాదు, తన ప్రసంగంతో భారత్ కు అంతర్జాతీయ సమాజం మద్దతునూ సాధించిపెట్టారు. భారత్ ను ప్రపంచ దేశాల్లో ఏకాకిగా చేయాలన్న పాకిస్థాన్, చైనా కుయుక్తిని తిప్పికొట్టి ఆ దేశాలే తలదించుకునేలా చేసిన సయ్యద్ అక్బరుద్దీన్.. అసలు సిసలైన హైదరాబాదీ. 


సయ్యద్ అక్బరుద్దీన్ వాక్‌ చాతుర్యమే ఆయనను భారత్‌లో హీరోగా నిలిపింది. కాశ్మీర్ అంశం భారత్ ఆంతరంగిక వ్యవహారమని ప్రపంచం నమ్మేలా చేసింది. 48 సంవత్సరాల తర్వాత కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించేలా చేశామంటూ సంబరపడ్డ పాకిస్థాన్, చైనా ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అందుకు కారణం.. అక్బరుద్దీన్ దౌత్యమే. కాశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో చర్చ తర్వాత.. మీడియా సమావేశం జరిగింది. ఇందులో పాక్, చైనా అధికార ప్రతినిధులు మాట్లాడిన తర్వాత.. భారత్ తరఫున మీడియా ముందుకు వచ్చారు సయ్యద్ అక్బరుద్దీన్. ఇందులోనే కాశ్మీర్‌ విషయంలో భారత్ వైఖరీ ఏంటో కుండ బద్ధలు కొట్టారు అక్బరుద్దీన్. పాక్‌తో శాంతి చర్చలు ఎప్పుడు మొదలుపెట్టబోతున్నారని పాక్‌ జర్నలిస్టులు ప్రశ్నిస్తే  ముందు మీతో కరచాలనం చేయనివ్వండి అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి సమయస్ఫూర్తి ప్రదర్శించారు. ఇక ఆ తర్వాత ఇండియా విధానాన్ని అంతర్జాతీయ మీడియా ముందు స్పష్టంగా, సూటిగా వివరించారు. మొత్తం సమావేశంలో సయ్యద్ అక్బరుద్దీన్ ఎక్కడా సహనం కోల్పోలేదు. విలేకరులతో సరదాగా మాట్లాడుతూనే తను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పేశారు. 


ఐక్యరాజ్యసమితిలో భారత్ కు తిరుగులేని విజయం సాధించిపెట్టిన అక్బరుద్దీన్ ఎవరో తెలుసా... పక్కా హైదరాబాదీ. ఆయన పుట్టి, పెరిగింది, చదువుకుందీ అంతా భాగ్యనగరంలోనే. అక్బరుద్దీన్ 1960 ఏప్రిల్ లో హైదరాబాద్ లో పుట్టారు. ఆయన తండ్రి బషీరుద్దీన్ ఉస్మానియా యూనివర్శిటీ జర్నలిజం విభాగం చీఫ్‌గా, అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వైస్ ఛాన్నలర్‌గా పనిచేశారు. అంతేకాదు.. ఖతార్ లో భారత రాయబారిగా కూడా సేవలందించారు. అక్బరుద్దీన్ తల్లి జెబా బషీరుద్దీన్ కోఠి మహిళా కళాశాలలో ఆ తర్వాత సత్యసాయి యూనివర్శిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తించారు. అక్బరుద్దీన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చదువుకున్నారు. పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ ఎఫైర్స్‌లో పీజీచేసి 1985లో ఐఎఫ్ఎస్‌గా ఎంపికయ్యారు. అక్బరుద్దీన్‌కు అరబిక్, ఉర్దూలపై గట్టి పట్టుంది. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషనర్‌లో రాయబారిగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా, విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 2016 జనవరి నుంచి ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. 


అక్బరుద్దీన్ అనేక అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ కు విజయం సాధించిపెట్టారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ పై నిషేధం, మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రపంచ గుర్తించడం వెనుక అక్బరుద్దీన్‌ కృషి అద్భుతమని దౌత్యవర్గాలు ప్రశంసిస్తాయి. అక్బరుద్దీన్ మాట సున్నితమైనప్పటికీ, వ్యవహారశైలి మాత్రం చాలా కఠినం. అంతర్జాతీయ వేదికలపై భారత్ సాధిస్తున్న దౌత్య విజయాలే ఇందుకు నిదర్శనం.





మరింత సమాచారం తెలుసుకోండి: