సాధారణంగా పెళ్ళి చేసుకున్న భార్యా భర్తలు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారంటే తీవ్రమైన కారణాలే ఉంటాయి. కోర్టులు కూడా మొదట కౌన్సిలింగ్ ఇచ్చి వీలైనంత వరకు భార్యాభర్తల్ని కలపాలనే చూస్తాయి.కేసులో మరీ తీవ్రత ఉంటే మాత్రమే విడాకులు మంజూరు చేస్తాయి. చిన్న చిన్న సమస్యలకు ఎవరూ కోర్టు దాకా విడాకుల కేసుతో వెళ్ళరు. కానీ ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ ప్రాంతంలో మాత్రం వింతైన ఘటన చోటు చేసుకుంది. 
 
ఒక వింత విడాకుల కేసుతో భర్త కోర్టుకెక్కాడు. తనకు తన భార్యతో విడాకులు కావాలని తన భార్య రోజు తనకు ఆహారంగా లడ్డూలు మాత్రమే పెడుతుందనే వింతైన కేసు కోర్టుకొచ్చింది. ప్రతిరోజు లడ్డూలు మాత్రమే భార్య పెడుతూ ఉండటంతో విసుగొచ్చిన భర్త కోర్టులో విడాకులు కోరుతున్నానని తెలిపాడు. ఎందుకు రోజూ లడ్డూలే పెడుతున్నావని కోర్టులో లాయర్ ఆమెను ప్రశ్నించగా ఆమె ఒక విచిత్రమైన కారణం చెప్పింది. 
 
తనకూ, తన భర్తకూ రోజూ ఏదో ఒక కారణంతో గొడవలు జరిగేవని ఆరోగ్యం కూడా బాగా లేకపోవటంతో ఒక తాంత్రికుడి వద్దకు వెళ్ళానని ఆమె చెప్పింది. తనకు ఉన్న సమస్యలను ఆ తాంత్రికుడితో వివరించగా సమస్యలకు పరిష్కారంగా ఉదయం 4 లడ్డూలను, సాయంత్రం 4 లడ్డూలను భర్తకు ఆహారంగా ఇవ్వాలని సూచించటంతో తాంత్రికుడు చెప్పిన విధంగా చేసానని భార్య తెలిపింది. 
 
ఈ సమస్యకు పరిష్కారం కోసం అధికారులు వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గతంలో కూడా భర్త ఎక్కువగా పబ్ జీ గేమ్ ఆడుతున్నాడని విసిగిపోయిన ఒక మహిళ విడాకుల కోసం కోర్టుకెక్కింది. బీహార్ రాజధాని పాట్నాలో భార్య స్నానం చేయట్లేదని ఒక భర్త విడాకుల కోసం కోర్టుకెక్కాడు. ఇలాంటి వింతైన కేసులు కోర్టులకు వస్తూ ఉండటంతో లాయర్లు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: