తప్పు చేసిన వైసీపీ నాయకులని వదిలేసి తప్పుని ప్రశ్నించిన టీడీపీ నాయకులపై కేసులు పెట్టడం ఏంటని మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రశ్నించారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాయలంలో జరిగిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. భద్రతా అధికారులపై దౌర్జన్యం చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలోకి అక్రమంగా ప్రవేశించిన మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణా రెడ్డిపై, భద్రతా నిబంధనలు ఉల్లంఘించి డ్రోన్ కెమెరాలు ఉపయోగించిన వారిపై ఎటువంటి కేసు నమోదు చేయకుండా.. దాన్ని ప్రశ్నించిన టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసి ప్రభుత్వం అప్రజాస్వామికంగా, నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందంటూ ద్వజమెత్తారు.
మా నాయకుడి భద్రతను ప్రశ్నార్ధకం చేసేలా ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్ కెమెరాలు వాడడాన్ని శాంతి యుతంగా నిరసిస్తూ.. నిబంధనల ప్రకారం వ్యవహరించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించినందుకు మాపై లాఠీలతో దాడి చేయటమే కాకుండా తిరిగి మాపైనే అక్రమంగా కేసులు పెడతారా అంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన తప్పేంటి. మేమేమైనా విధ్వంసానికి పాల్పడ్డామా.? ప్రజా ఆస్థిని నాశనం చేశామా.? ఎందుకు కేసులు పెట్టారు అంటూ నిలదీశారు.
ప్రతిపక్ష నాయకుడి భద్రతా సిబ్బందిని ఎదురించి ఫోటోలు వీడియోలు తీసిన వారిపై చర్యలు తీసుకోకుండా వారిని సాక్ష్యాత్తు పోలీసులే వెనకేసుకు రావడం, తప్పించేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్యమేనా.? బాధ్యతగా వ్యవహరించాల్సిన ఒక మంత్రి మీడియా సమక్షంలో అబద్దాలు చెప్పడం సమంజషమా.? జలవనరుల శాఖ ఆదేశాల మేరకే డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తే అందుకు సంబంధించి పోలీసు శాఖ అనుమతి పత్రాలను ఎందకు చూపలేదని ప్రశ్నించారు. పోలీసులు ప్రజాస్వామ్యయుంగా వ్యవహరించాలన్నారు. అనుమతి పత్రాలు లేకుండా డ్రోన్ కెమెరాలు ఉపయోగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.