సెప్టెంబర్ మాసం లో రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు . ఈమేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళ్తూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెల్సిందే . వైఎస్ చేపట్టలేకపోయిన కార్యక్రమాన్ని జగన్ పునరుద్ధరించాలని నిర్ణయించారు . చిత్తూరు జిల్లా నుంచే రచ్చబండ కార్యక్రమం ప్రారంభించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి . సెప్టెంబరు 1వ తేదీ నుంచి సన్న బియ్యం, పింఛన్లను డోర్ డెలివరీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది .
నాణ్యమైన ప్యాకింగ్ చేసిన సన్న బియ్యం పంపిణి కార్యక్రమాన్ని శ్రీకాకుళం నుంచి ప్రారంభించనున్నారు . ఇక రేషన్, పింఛన్ల కోసం లబ్దిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదు . ఇక రైతుల కోసం వైఎస్సార్ భరోసా కార్యక్రమాన్ని అక్టోబరు 15వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని యోచనలో వైఎస్ జగన్ ఉన్నారు. ఉగాది నాటికి అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వైఎస్ జగన్ నిర్ణయించారు . వరుస ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు . వచ్చేనెల లో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడం ద్వారా మరింత ప్రజలకు చేరువ కావాలని భావిస్తున్నారు .
జిల్లాల పర్యటనలద్వారా ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన అమలు చేస్తోన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు . మేనిపెస్టోలోని హామీలను ఎక్కడిక్కడే క్షేత్రస్థాయిలో అమలు చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావచ్చుననేది ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది . ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన కు సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.