తెలంగాణాలో అత్యంత ఛరిష్మా కలిగిన నేతల్లో సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఒకరు. గతంలో తెరాస పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి హరీష్ రావు. నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన రోజుల్లో ఆయన ఎన్నో విజయవంతమైన పధకాలను అమలు చేశారు. గొలుసుకట్టు చెరువులు తవ్వించారు. మిషన్ భగీరథ అయనఆధ్వర్యంలోనే ప్రారంభం అయ్యింది. 2019 కి వచ్చే సరికి పూర్తిగా మారిపోయింది.
ఈసారి అయన ఎమ్మెల్యేగా గెలుపొందినా మంత్రి పదవిని ఇవ్వలేదు. అటు కేటీఆర్ కు కూడా పదవి ఇవ్వలేదు. కాకపోతే, కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా భాద్యతలు అప్పగించారు. హరీష్ రావు కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. ఇది చాలామంది నేతలకు నచ్చడం లేదు. తెరాస పార్టీ పుట్టినప్పటినుంచి కెసిఆర్ వెన్నంటే ఉండి పార్టీ బాధ్యతలు చూసుకున్నారు. పార్టీని బలోపేతం చేయడంలో అయన కృషి మెచ్చుకోదగ్గది.
అయితే, సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉంటూనే హరీష్ రావు అనేక మంచి పనులు చేస్తున్నారు. నియోజక వర్గాన్ని అద్భుతంగా డెవలప్ చేశారు. ఇప్పుడు పర్యారణంపై దృష్టి పెట్టారు. వినాయక చవితి వస్తే వాడవాడలా, గల్లీ గల్లీలో వినాయక విగ్రహాలు పెడతారు. ఇలా విగ్రహాలు పెట్టడం వలన పర్యావరణానికి హాని కలుగుతుంది. పైగా అందులో వాడే రసాయననాలు ప్రమాదకరమైనవి.
అందుకే హరీష్ రావు ఓ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వినాయక చవితికి వాడవాడలా కాకుండా కేవలం పట్టణంలో ఒకేచోట విగ్రహాలు ఏర్పాటు చేయాలని, అది కూడా పర్యావరణానికి హాని కలుగజేయని విధంగా ఉండే మట్టి వినాయకుడుని పెట్టాలని నిర్ణయించారు. ఇలా చేయడం వలన పట్టణంలో ట్రాఫిక్ కు అంతరాయం తగ్గుతుంది. పర్యావరణం పాడవకుండా ఉంటుంది. మరి దీనికి సిద్ధిపేట ప్రజలు ఒప్పుకుంటారా చూడాలి .