విజయవాడ కనకదుర్గ గుడి ఈవో నియామకం ప్రతిసారి వివాదాస్పదంగా మారుతోంది . అక్కడ పోస్టింగ్ లకు వచ్చిన ప్రతి అధికారి ఏదో ఒక వివాదంతో బదిలీ కావడం సర్వ సాధారణంగా మారింది . ఇప్పుడు విజయవాడ కనక దుర్గ గుడి ఈవో బదిలీ వ్యవహారం దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు తలనొప్పిగా మారింది .
సరిగ్గా ఏడాది కిందట ఈవోగా వచ్చిన కోటేశ్వరమ్మను బదిలీ చేస్తారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి . బదిలీ జీవో త్వరలోనే విడుదలవుతోందని కొండపై తెగ ప్రచారం నడుస్తోంది . ఈవో కోటేశ్వరమ్మ ప్లేస్ లో అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈవో సురేష్ వస్తారని తెలుస్తోంది . అయితే ఈవో బదిలీల వెనుక వేరే కథ ఉందనేది ప్రతిపక్షాల ఆరోపణ .
దుర్గ గుడి ఈవో, మంత్రి వెల్లంపల్లి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది . అన్నవరం ఈవో సురేష్ వ్యవహారం పట్ల ఆ జిల్లా ఎమ్మెల్యేలు సంతృప్తికరంగా లేరు . ఆయన్ని మార్చాలని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు మొరపెట్టుకున్నారు . దీంతో ఆయన్ని మారుస్తారని మంత్రి వెల్లంపల్లి కూడా చెప్పారట . కానీ తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు వ్యతిరేకించిన ఈవో సురేష్ ని దుర్గ గుడి ఈవోగా ఎలా పోస్టింగ్ చేస్తారని బెజవాడ రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు .
దసరాకు ముందే దుర్గ గుడి ఈవో ను మార్చడం వెనుక పెద్ద కుట్ర ఉందని రాజకీయ నేతలు ఆరోపణలు చేశారు. దుర్గగుడిపై ఏదో ఒక వివాదం చెలరేగడం కామన్, ఇప్పుడు ఈవో బదిలీ వ్యవహారం కూడా కాంట్రవర్సీగా మారుతుంది . అయితే ఈవోల బదిలీల పట్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి .